టీ20 వరల్డ్ కప్-2024లో మహా సమరానికి వేళైంది. భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ మినీ వార్ జరగనుంది. ఈ పోరులో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. అయితే తమ దేశంతో మ్యాచ్ జరగనున్న వేళ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రత్యర్థి జట్టు అయిన రోహిత్ సేనకు కొన్ని కీలక సూచనలు అందించడం గమనార్హం.
భారత జట్టు కూర్పు గొప్పగా లేదని, జట్టులో మార్పులు చేయాలని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. అయితే టీమిండియా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉందని, ప్లేయర్లంతా ఫామ్లో ఉన్నారని తెలిపాడు. అలాగే ఐసీసీని అక్మల్ హెచ్చరించాడు. న్యూయార్క్లోని పిచ్ల గురించి ప్రస్తావిస్తూ.. మంచి వికెట్లను సిద్ధం చేయకపోతే టీ20 వరల్డ్ కప్కు ఆదరణ తగ్గిపోతుందని అన్నాడు.

''బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా ఉందని నేను భావించట్లేదు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ను ముగించాలి. అది టీమిండియాకు ఎంతో ముఖ్యం. రోహిత్ శర్మతో కలిసి యశస్వీ జైస్వాల్ ఓపెనర్గా, వన్డౌన్లో విరాట్ రావడమే సరైనది. కోహ్లితోనే ఓపెనింగ్ చేయాలని భావిస్తే ఏదో సందర్భంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అతడు ఓ ఎండ్లో కొనసాగుతూ మ్యాచ్లు ఫినిష్ చేయాలంటే బ్యాటింగ్ స్థానం మార్చాలి. కోహ్లితో ఓపెనింగ్ చేయిస్తూ భారత్ తప్పు చేస్తుందని భావిస్తున్నా''

''భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. బుమ్రా గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ అదరగొడుతున్నాడు. హార్దిక్ పాండ్య వికెట్లతో సత్తాచాటుతున్నాడు. ఇక ఒక వేదికగానే మూడు మ్యాచ్లు ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. అయితే పెద్ద మ్యాచ్లకు ఐసీసీ మెరుగైన పిచ్లు సిద్ధం చేయాలి. లేదంటే ప్రపంచకప్ను ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు'' అని కమ్రాన్ అక్మల్ అన్నాడు. కాగా, ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వచ్చారు. వన్డౌన్లో పంత్ బరిలోకి దిగాడు. యశస్వీ జైస్వాల్ బెంచ్కే పరిమితమయ్యాడు.