శ్రీలంక రైజింగ్ స్టార్ కామిందు మెండిస్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ అరంగేట్రంలో వరుసగా ఎనిమిది టెస్టుల్లో 50+ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గాలె వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఆల్టైమ్ రికార్డు అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ పేరిట ఉంది.
షకీల్ వరుసగా ఏడు టెస్టుల్లో 50+ స్కోరు సాధించాడు. ఈ జాబితాలో కామిందు మెండిస్, షకీల్ తర్వాతి స్థానాల్లో వరుసగా బెర్ట్ సుత్క్లిఫ్ (6), సయిద్ అహ్మద్ (6), బసిల్ బచర్ (6), సునీల్ గవాస్కర్ (6) ఉన్నారు. ఈ ఆటగాళ్లంతా అరంగట్రేం నుంచి టెస్టుల్లో వరుసగా ఆరు సార్లు 50+ స్కోరు సాధించారు.

కాగా, దినేశ్ చండిమాల్ (116; 208 బంతుల్లో, 16 ఫోర్లు)తో పాటు ఏంజెలో మాథ్యూస్ (78 బ్యాటింగ్; 166 బంతుల్లో, 6 ఫోర్లు), మెండిస్ (51 బ్యాటింగ్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటడంతో రెండో టెస్టు తొలి రోజు న్యూజిలాండ్పై శ్రీలంక పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి లంక మూడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. అయితే ఆతిథ్య జట్టు లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (1; 3 బంతుల్లో)ను టిమ్ సౌథి తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు.
అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దినేశ్ చండిమాల్.. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (46; 109 బంతుల్లో, 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కురణరత్నె ఔటైనప్పటికీ మాథ్యూస్తో కలిసి చండిమాల్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. మూడో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు.ఈ క్రమంలో శతకం కూడా అందుకున్నాడు.
సెంచరీ సాధించిన కాసేపటికే చండిమాల్ పెవిలియన్కు చేరాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన మెండిస్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ అర్ధశతకం సాధించాడు. కామిందు మెండిస్ గత ఎనిమిది టెస్టుల్లో 61 (ఆస్ట్రేలియాపై), 102, 164 (బంగ్లాదేశ్), 92* (బంగ్లాదేశ్), 113 (ఇంగ్లండ్), 74 (ఇంగ్లండ్), 64 (ఇంగ్లండ్), 114 (న్యూజిలాండ్), 51* (న్యూజిలాండ్)పై 50+ స్కోరు సాధించాడు.