హైదరాబాద్: బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) గురించి పరిచయం అక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిస్తోన్న ఇతడు తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ ఓటమిని జీర్ణించుకోలేని కమల్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీతో సహా టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మ్యాచ్లో ధావన్ సెంచరీ చేసినా, రోహిత్ శర్మ, ధోనిలు అర్ధసెంచరీలతో రాణించడంతో టీమిండియా 321 పరుగులు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై కేఆర్కే తీవ్రంగా తప్పుబట్టాడు.

'కోహ్లీ ఓ మోసగాడు. విజయ్ మాల్యాతో కలిసి పార్టీలు చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. అయినా డకౌట్ అయిన కోహ్లీ.. ఇంకా స్కోరు చేసి ఉంటే బాగుండేది అంటాడు. అందుకోసం మాల్యాను పిలుస్తే బాగుంటుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా పాక్ చేతిలో ఓటమితో రగిలిపోతోంది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోతుందని భావించను. భారత్ తన తదుపరి మ్యాచ్ సఫారీలతో ఆడాల్సి ఉంటుంది. ఈ రోజు అంతా తేలిపోయింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గదు. ఒకవేళ సఫారీలను ఓడించినా.. సెమీస్లో గానీ, లేక చివరి మెట్టు ఫైనల్లోనైనా భారత్ బోల్తా కొట్టడం ఖాయం' అని కేఆర్కే వరుస ట్వీట్లతో మండిపడ్డాడు.
'రెండు కోట్ల జనాభా ఉన్న లంకలో 11 మంది చాంపియన్లు దొరికారు. కానీ 130 కోట్ల భారత జనాభాలో 11 మంది విన్నర్లను బీసీసీఐ గుర్తించలేక పోయింది. ఇది కలియుగం కనుక రావణులే గెలుస్తారని లంకేయులు నిరూపించారని' కేఆర్కే తన వరుస ట్వీట్లలో రాసుకొచ్చాడు.