
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ జోహన్నెస్బర్గ్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న నాలుగో టెస్ట్కు దూరం కానున్నాడు. ప్రస్తుతం పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ వికెట్ తీసిన ఆనందంలో సఫారీ పేసర్ కగిసో రబాడ మైదానంలో హద్దు మీరి ప్రవర్తించాడు.
దీంతో అతడు లెవెల్-1 తప్పిదానికి పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది. ఈ ఘటనను తప్పుబట్టిన ఐసీసీ రబాడకు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ జత చేర్చింది. ఇప్పటికే రబాడ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్ల ఉండటంతో తాజా డీమెరిట్ పాయింట్తో కలిపి ఆ సంఖ్య నాలుగుకు చేరింది.
ఫలితంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జనవరి 24 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగో టెస్ట్కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే!.... మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్ తీసిన ఆనందంలో కగిసో రబాడ క్రీజులో ఉన్న జో రూట్కు ఎదురుగా వెళ్లి నేలపై గుద్దుతూ పెద్దగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.
రబాడ ప్రవర్తన ఐసీసీ నియమావళి యొక్క ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు తేల్చింది. ఆర్టికల్ 2.5 ఏం చెబుతుందంటే.... "అంతర్జాతీయ మ్యాచ్లో బ్యాట్స్ మెన్ వికెట్ తీసిన తర్వాత దూకుడుగా ప్రతిచర్యను రేకెత్తించే భాష, చర్యలు లేదా హావభావాలను ఉపయోగించడం" నేరం కిందకు వస్తుంది. అయితే, మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు రబాడ తన నేరాన్ని అంగీరించాడు.
అయితే, కగిసో రబాడపై ఐసీసీ చర్యలు తీసుకోవడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ "ప్రతి ఎమోషన్ను మనస్ఫూర్తిగా వ్యక్తపరచాలి. నా పిల్లలకు కూడా అదే చెబుతా. అయితే రబాడ చేసిన తప్పేంటో తనకర్థం కావడం లేదు. కనీసం రూట్ను అతడు తాకలేదు. అతడు ఎమోషనల్గా ప్రవర్తించడమే తప్పయితే మనుషుల బదులు 11 రోబోట్లతో క్రికెట్ ఆడిస్తే సరిపోతుంది కదా!" అని వ్యంగ్యంగా అన్నాడు.