
దుబాయ్: ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మంచి సమతూకంతో ఉందని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020 టైటిల్ ఢిల్లీ గెలుస్తుందని రబాడ ధీమా వ్యక్తం చేశాడు. పీఎల్లో కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్.. గత ఏడాది చాలా చేరువగా వెళ్లింది. కానీ క్వాలిఫయర్స్-2లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడిన ఢిల్లీ ఒత్తిడి తట్టుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాకౌట్ నుంచి ఢిల్లీ నిష్క్రమించినా.. మంచి మార్కులే పడ్డాయి. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును అద్భుతంగా నడిపించాడు.
'ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్కి చాలా చేరువగా వెళ్లింది. మేము బాగా ఆడాం. ఈ ఏడాది కూడా అదే జోరుని కొనసాగించగలమనే నమ్మకంతో ఉన్నాం. గత ఏడాది ప్లేఆఫ్కి చేరడంతో జట్టులోనూ ధీమా పెరిగింది. కానీ ఇది కొత్త సీజన్ కావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఏదైనా అంతే. ఈ ఏడాది కూడా జట్టు మంచి సమతూకంతో ఉంది. ఐపీఎల్ 2020 టైటిల్ గెలుస్తాం' అని కగిసో రబాడ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 18 మ్యాచ్లాడిన కగిసో రబాడ 31 వికెట్లు పడగొట్టాడు.
2012 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఆడుతోంది. ఆరేళ్ల పాటు కనీసం ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయిన ఢిల్లీ.. గత ఏడాది టోర్నీలో దుమ్ముదులిపింది. 2019 సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన ఢిల్లీ.. 9 మ్యాచ్ల్లో గెలిచి 18 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, పృథ్వీ షా తదితర యువ ఆటగాళ్లతో నిండిన ఆ జట్టుని ప్లేఆఫ్లో అనుభవలేమి దెబ్బతీసింది.
గతంలో కంటే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా మారింది. ఢిల్లీలోకి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అంజిక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వచ్చారు. ఇద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. వారి అనుభవం జట్టుకు కచ్చితంగా ఉపయోగపడనుంది. అంజిక్య రహానే, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, మార్కస్ స్టోయినిస్, శిమ్రన్ హెట్మయిర్ లాంటి స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగంలో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, సందీప్ లామిచ్చనే, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జే, కీమో పాల్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, మోహిత్ శర్మ, కగిసో రబాడలతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది.