
హైదరాబాద్: అవధుల్లేని అభిమానాన్ని చూపాలంటే తమిళ ప్రజలకే సాధ్యం. ఇప్పుడు వారి అభిమానాన్ని అదే తరహాలో మహేంద్రసింగ్ ధోనీపైనా చూపిస్తున్నారు. ధోనిని దత్తపుత్రుడిలా చూస్తారు. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్కింగ్స్కే ఆడుతూ అక్కడి జనానికి బాగా చేరువయ్యాడు మహి. ఈ నేపథ్యంలోనే తమిళ సంస్కృతిని అర్థం చేసుకుని పంచెకట్టు కట్టి, విజిల్ పోడు అంటూ డైలాగ్ పేల్చి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్కింగ్స్ జట్టు ఐపీఎల్లోకి పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో చెన్నైలో ధోని జట్టు అత్యంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు.
అభిమానుల్ని ఆకర్షించేందుకు అతను అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా 'కాలా' టీజర్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పలికిన డైలాగ్ను అతను డబ్ స్మాష్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. టెక్నికల్ గానే కాదు.. వీరి సరదాలు వీధుల వరకూ వచ్చేశాయి.
ఓపెన్ టాప్ బస్ ఎక్కి, ఆటోల్లో తిరుగుతూ చెన్నై వీధుల్లో చిందులేస్తూ గడుపుతున్నారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యమే తన అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మరో 8 రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ గురువారం ప్రాక్టీస్ సెషన్కు వెళ్లేందుకు ఓపెన్ టాప్ బస్ను ఎంచుకుంది. ఇక దీంతో ఆటగాళ్ల సరదాకు అవధులు లేకుండాపోయింది. వారంతా చిన్న పిల్లల్లా మారిపోయి అల్లరి చేశారు. వీరి బస్సును అనుసరిస్తూ వేలాది మంది అభిమానులు మైదానానికి చేరుకున్నారు.
బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన ధోనీ:
కొద్ది రోజుల క్రితం నెట్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన ధోనీ ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్లో ఆటగాళ్లకు బంతులేస్తూ కనిపించాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) క్యాంపులోనూ ధోనీ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ ఫొటోలను సీఎస్కే యాజమాన్యం తన ట్విటర్ ద్వారా పంచుకుంది.