
సిడ్నీ: తాను అత్యుత్తమ కోచ్ కాకపోయినా.. కొన్నింటిలో బాగానే పనిచేస్తా అని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అంటున్నాడు. భారత్ పర్యటన అనంతరం తనపై వచ్చిన విమర్శల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టబోనని తెలిపాడు. విమర్శలు తనకు మేలుకొలుపు లాంటివని ఆయన పేర్కొన్నాడు. సొంత గడ్డపై భారత్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయాక కోచ్తో ఆసీస్ ఆటగాళ్లకు పొసగడం లేదని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. కోచ్ వ్యవహారశైలితో సీనియర్ ఆటగాళ్లు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జట్టుతో లాంగర్ సరిగా వ్యవహరించడం లేదని ఆ కథనం సారాంశం.
తనపై వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ లాంగర్ స్పందించాడు. ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... 'నాపై వచ్చిన విమర్శలను విడిచిపెట్టను. అవి నాకు మేలుకొలుపు లాంటివి. వాటిని గొప్ప బహుమతిగా భావిస్తా. ఎప్పుడైతే కోచింగ్ కెరీర్ను వదులుకుంటానో అప్పుడు.. నన్ను నేను కొత్త కోచ్గానే పరిగణించుకుంటా. నా జీవితంలో మార్గనిర్దేశకులు ఎవరైనా ఉన్నారంటే నా గురించి నిజాలు చెప్పేవాళ్లే. నాకు అలాంటి వాస్తవమైన అభిప్రాయాలే కావాలి. ఆ సమయంలో అవి నాకు నచ్చకపోయినా, అవెంతో ముఖ్యం' అని అన్నాడు.
'నా గురించి జట్టులో ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలిసింది. నేనేంటో మీకు తెలుసు. చాలా సాధారణంగా ఉంటా. ఈ విమర్శలని సానుకూలంగా తీసుకుంటా. వాటి మీద దృష్టిసారిస్తా. అయితే కొన్నిసార్లు కఠినంగా ఉంటా. నేను అత్యుత్తమ కోచ్ కాకపోయినా.. కొన్నింటిలో బాగానే పనిచేస్తా. ఈ అంశంపై ఆటగాళ్లు ఎప్పుడైనా నా వద్దకు వచ్చి మాట్లాడొచ్చు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకుందాం' అని జస్టిన్ లాంగర్ తెలిపాడు.
ఇటీవల టీమిండియాతో 2-తో టెస్టు సిరీస్ కోల్పోయాక ఆస్ట్రేలియా జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా టెస్ట్ కెప్టెన్ టీమ్ పైన్ను సారథిగా తీసేయాలంటూ పలువురు మాజీలు డిమాండ్ చేశారు. స్టీవ్ స్మిత్కు బాధ్యతలు అప్పగించాలని కొందరు సూచించారు. ఆపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్పై మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా అతడు స్పందించాడు. ఈ నేపథ్యంలో తాజా వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.