సిడ్నీ: హెడ్కోచ్ జస్టిన్ లాంగర్తో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆసీస్ ప్రముఖ వార్త సంస్థ ఒకటి పేర్కొంది. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జట్టుతో లాంగర్ సరిగా వ్యవహరించడం లేదని పేర్కొంది. కంగారు జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా లాంగర్ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారని ఆ వార్త సంస్థ రాసుకొచ్చింది.
ఎప్పుడూ ఆటగాళ్లు తమ తిండి విషయాలను గమనించడానికి ఒకరు కావాలనుకుంటే.. అప్పుడు తన పని తాను చేసినట్లు కాదని జస్టిన్ లాంగర్ పేర్కొన్నట్లు ఆసీస్ వార్త సంస్థ తెలిపింది. బౌలింగ్ వ్యవహారాల్లో తాను కలుగజేసుకోకపోవడంపై స్పందిస్తూ.. 'నేనెప్పుడూ బౌలర్ల గణంకాల గురించి మాట్లాడను. ఎప్పుడూ బౌలర్ల సమావేశానికి హాజరుకాను. బౌలింగ్ కోచ్ ఉండేదే అందుకు. అయితే కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. ఆ విషయాలపైనా కన్నేయాల్సి వచ్చింది' అని ఆసీస్ కోచ్ లాంగర్ అన్నాడు.
ఇటీవల గబ్బా టెస్టులో తమ ఆటగాడు ఒకరు మైదానంలో తినేందుకు జేబులో సాండ్విచ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, దాంతో అతడిని అలా చేయొద్దని చెప్పినట్లు జస్టిన్ లాంగర్ అసలు విషయం తెలిపాడు. గత అనుభవాల దృష్ట్యా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నిరంతరం కెమెరాల నిఘా ఉంటుందని, జేబులో ఏదైనా ఉంటే అది ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లే ప్రమాదం ఉన్నట్లు అతడికి వివరించానని ఆసీస్ కోచ్ తెలిపాడు. దీన్ని ఎలా సమర్థించుకుంటావని ఆ ఆటగాడిని నిలదీసినట్లు లాంగర్ స్పష్టం చేశాడు.
ఇటీవల టీమిండియాతో 2-తో టెస్టు సిరీస్ కోల్పోయాక ఆస్ట్రేలియా జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్ టీమ్ పైన్ ను సారథిగా తీసేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. అయితే ఈ విభేదాలను ఆటగాళ్లు జట్టు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లలేదని ఆ కథనంలో పేర్కొనడం విశేషం.