ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఐసీసీని శాసించే శక్తి బీసీసీఐకి ఉంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి భారీ జీతభత్యాలు అందిస్తుంటుంది. కానీ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనపై విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదు. బోర్డు వర్గాలు స్వయంగా సంప్రదించినా భారత జట్టు కోచ్ పదవి మాకొద్దని తిరస్కరిస్తున్నారు.
స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రయత్నించినప్పటికీ ఆసక్తి చూపలేదు. భారత జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమోననే ఆలోచనతో తిరస్కరించానని పాంటింగ్ చెప్పాడు. ఫ్లెమింగ్ కూడా దాదాపు అదే కారణం చెప్పాడు. కానీ ఆస్ట్రేలియా మాజీ కోచ్, ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పిన కారణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అంతేగాక లాంగర్ వివరణ టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను చిక్కుల్లో పడేసింది. అసలేం జరిగిందంటే... ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జస్టిన్ లాంగర్ టీమిండియా కోచ్ పదవి గురించి మాట్లాడాడు. కోచ్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన సలహా కూడా తనపై ప్రభావం చూపించిందని అన్నాడు. టీమిండియా కోచ్ పదవి అంటే ఒత్తిడితో పాటు రాజకీయాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ సలహా ఇచ్చాడని పేర్కొన్నాడు. ఐపీఎల్తో పోలిస్తే ఒత్తిడి, పాలిటిక్స్ వెయ్యి రెట్లు అధికంగా ఉంటాయని రాహుల్ చెప్పాడని లాంగర్ అన్నాడు.
''టీమిండియా కోచ్ అద్భుతమైన పదవి. కానీ దాని పోటీలో నేను ఉండట్లేదు. ఇది అందరినీ ఆకట్టుకునే పాత్ర అని నాకు తెలుసు. ఆస్ట్రేలియా జట్టుతో నాలుగేళ్లు పనిచేసి అలసిపోయా. భారత్లో ఇది ఒత్తిడితో ఉంటుంది. దీని గురించి కేఎల్ రాహుల్తో మాట్లాడాను. 'ఐపీఎల్లో ఒత్తిడి, రాజకీయాలు ఉంటాయనకుంటే దానికి వెయ్యి రెట్లు అక్కడ ఉంటుంది' అని రాహుల్ చెప్పాడు. ఇదో మంచి సలహా. భారత జట్టు కోచ్ మంచి జాబే, కానీ ఇప్పుడు నాకు అది సరైన సమయం కాదు'' అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ను నియమించడానికి బీసీసీఐ ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. మే 27, సాయంత్ర 6 గంటలతో అప్లై చేసే గడువు ముగుస్తుంది. కాగా, భారత జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.