న్యూఢిల్లీ: టెస్ట్ మ్యాచ్ నిర్వహణ అంటే కూతురు పెళ్లి చేసి నట్టేనని మాజీ జస్టిస్ ముకుల్ ముద్గల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డిడిసిఏ)లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ముకుల్ ముద్గల్ను భారత్-దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 3న ఫిరోజ్ షా కోట్లా వేదికగా ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్కు పరిశీలకునిగా ఢిల్లీ హైకోర్టు నియమించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఆ ఏర్పాట్లలో ఉన్న ముద్గల్.. తనపై ఉంచిన కర్తవ్యాన్ని 'కుమార్తె వివాహ బాధ్యత'గా భావిస్తున్నట్లు సరదాగా చెప్పారు. తనకిదో ఆసక్తికరమైన అనుభూతినిస్తోందని తెలిపారు.
'నాకు కూతురు లేదు. అయినా కూతురు పెళ్లి చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. టెస్ట్ మ్యాచ్ నిర్వహణ కూడా అలాంటిదే. ముఖ్యంగా సమయం తక్కువగా ఉండటంతో అంతా హడావుడిగా సాగుతోంది' అని ముద్గల్ సరదాగా వ్యాఖ్యానించారు.
నాలుగో టెస్టుకు 8250 మంది పాఠశాల పిల్లల్ని ఉచితంగా అనుమతిస్తున్నామని, తనతో సహా ఏ ఒక్కరికీ ఒక్క ఉచిత పాస్ కూడా లేదని ముద్గల్ స్పష్టం చేశారు.