నన్ను నేను మెరుగు పరచుకోవాలనుకుంటున్నా: ధోనితో పోలికపై పంత్

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్లో సరికొత్త ఆరంభం కోసం ఎదురు చూస్తున్నట్లు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 15 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పోలిక తెచ్చే ప్రశంసల కంటే ఆటపైనే ఎక్కువగా దృష్టి సారించానని పంత్ అన్నాడు. ధోని ఆట తీరును తాను అమితంగా ప్రేమిస్తానని.. అదే విధంగా ప్రతీరోజూ తనను తాను మెరుగుపరచుకుంటున్నట్లు పంత్ తెలిపాడు.

పంత్ మాట్లాడుతూ
పంత్ మాట్లాడుతూ "దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న సిరీస్ కోసం బాగా ప్రాక్టీస్ చేశా. ఈ సిరిస్లో పాజిటివ్ మైండ్సెట్తో బరిలోకి దిగుతా. మంచి ఆరంభాలను ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నిస్తా" అని అన్నాడు. వెస్టిండిస్ పర్యటనలో తనకు లభించిన అవకాశాలను పంత్ సద్వినియోగం చేసుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

గత పర్యటన గొప్పగా సాగింది
"గత పర్యటన మా జట్టుకు గొప్పగా సాగింది. క్లీన్ స్వీప్తో తిరిగి రావడం చాలా బాగుంది. స్వదేశానికి తిరిగొచ్చాక చివరి సిరీస్ గతమైంది. సఫారీతో సిరిస్కు మానసికంగా కూడా సన్నద్ధమయ్యాము. సొంత ప్రేక్షకుల మద్దతు ఎలాగూ ఉంటుంది. అయితే ప్రత్యర్థి జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు" అని పంత్ అన్నాడు.

విండిస్ పర్యటనలో అనేక రికార్డులు
విండిస్ పర్యటనలో రిషబ్ పంత్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్ కీపర్గా అరుదైన ఘనత సాధించిన పంత్... విండిస్ పర్యటనలో ధోని పేరిట ఉన్న అనేక టెస్టు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

ధోని రికార్డు బద్దలు
టెస్టుల్లో అత్యంత వేగంగా 50 ఔట్లు చేసిన భారత వికెట్ కీపర్గా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా పంత్ 11 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా, భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు తొలుత మూడు టీ20ల సిరిస్ జరుగుతుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది.

ధర్మశాల టీ20తో సఫారీ పర్యటన ప్రారంభం
టీ20 సిరిస్కు ధర్మశాల, మొహాలి(సెప్టెంబర్ 18), బెంగళూరు(సెప్టెంబర్ 22) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది. ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications