
అయ్యర్-టేలర్ సెంచరీలు:
తొలి వన్డేలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా-న్యూజిలాండ్ జట్లలో నాలుగో స్థానంలో వచ్చిన బ్యాట్స్మన్లు సెంచరీలు చేసారు. కివీస్ తరఫున నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రాస్ టేలర్ (109), టీమిండియా తరఫున నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ (103; 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్లు) శతకాలు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో అయ్యర్.. టార్గెట్ను ఛేదించే క్రమంలో టేలర్ శతకొట్టారు.

వన్డే చరిత్రలో ఇది మూడోసారి:
ఒకే వన్డే మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేయడం వన్డే చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. 2017లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఒక వన్డేలో నాలుగో స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్-ఇయాన్ మోర్గాన్లు సెంచరీలు చేసారు. అంతకుముందు 2007లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డేలో ఏబీ డివిలియర్స్-టెతెండా తైబులు నాలుగులో వచ్చి సెంచరీలు సాధించారు. తాజాగా అయ్యర్-టేలర్లు ఈ అరుదైన జాబితాలో చేరారు.

ఓపెనర్లు విఫలమైతేనే:
సాధారణంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్లు, ఫస్ట్డౌన్ ఆటగాళ్లు మాత్రమే సెంచరీలు ఎక్కువగా చేస్తుంటారు. సెకండ్ డౌన్ (నాలుగో స్థానం)లో వచ్చిన వారు హాఫ్ సెంచరీలను ఎక్కువగా చేస్తారు. నాలుగో స్థానం నుంచి దిగువకు ఉన్న బ్యాట్స్మన్లు తరుచు హాఫ్ సెంచరీలు చేయడం మనం చూస్తాం. ఒకవేళ ఓపెనర్లు విఫలమైన సందర్భాల్లో మూడు, నాలుగు స్థానాల్లోని బ్యాట్స్మెన్లు సెంచరీలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా తొలి వన్డే మ్యాచ్లో అవకాశం వచ్చిన అయ్యర్-టేలర్లు సెంచరీలు చేసారు.

సెహ్వాగ్ తర్వాత అయ్యర్:
కెరీర్లో తొలి వన్డే శతకం సాధించిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. హామిల్టన్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాట్స్మన్గా అయ్యర్ నిలిచాడు. 2009లో ఇదే మైదానంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అజేయంగా 125 పరుగులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 2015లో 100 పరుగులు చేశాడు. సెహ్వాగ్, అయ్యర్, ధావన్ల తర్వాత స్థానంలో లోకేష్ రాహుల్ (88) ఉన్నాడు.


Click it and Unblock the Notifications












