హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్ కోసం బెంగుళూరులో సోమవారం (ఫిబ్రవరి 20)నాడు నిర్వహించిన వేలంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక్క ఆటగాడిని కూడా కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబరచలేదు.
ఐపీఎల్ 10వ ఎడిషన్ వేలంలో మొత్తం 350 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. అందులో నుంచి 76 మందిని ఎనిమిది ప్రాంఛైజీలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే వేలం కేవలం 66 మంది ఆటగాళ్లనే ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ఐపీఎల్లో ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ తరుపు నుంచి నలుగురు యువ క్రికెటర్లు రికీ భుయి, స్టీవ్ స్టీఫెన్, డి. స్వరూప్, పి. విజయ్ కుమార్లు ఉన్నారు. ఈ నలుగురిలో రికీ భుయిని మాత్రమే ఢిపెండింగ్ ఛాంఫియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తన వద్దే నిలుపుకుంది.

2016లో జరిగిన ఐపీఎల్ 9లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఉన్న రికీ భుయికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. మిగిలిన మిగతా ముగ్గురు ప్లేయర్లను 2017 వేలంలో ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ఉన్న క్రికెట్ పెద్దలు బీసీసీఐలో తమ పోస్టుల గురించే ఆలోచిస్తున్నారు గానీ, మెరుగైన క్రికెటర్లను తీర్చిదిద్దామన్న ఆలోచనే లేదని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. అంతేకాదు భారత జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఏసీఏకి చెందిన వాడు కావడం విశేషం.
ఈ మధ్య కాలంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసే క్రికెటర్లు రావడం లేదని క్రికెట్ విశ్లేషకుల భావన. దీనికి తోడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా భావి క్రికెటర్లను తీర్చి దిద్దడంలో కాస్తంత అలసత్వం ప్రదర్శిస్తుందనే వాదన కూడా ఉంది.
బీసీసీఐలో తమ పదవులను కాపాడుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పెద్దలు క్రికెటర్లకు మెరుగైన వసతులను కూడా కల్పించలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏసీఏ నుంచి ఏ ఒక్క క్రికెటర్ కూడా ఐపీఎల్కు ఎంపిక కాకపోవడంపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.