India vs Pakistan: గత నెల ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దులో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. కొంత మంది పాకిస్థాన్ క్రికెటర్లు ఈ ఉద్రిక్త పరిస్థితిలో సరిహద్దుకు వచ్చి మంటలకు ఆజ్యం పోస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వాఘా సరిహద్దుకు చేరుకున్నాడు. ఆ సమయంలో షాహిద్ అఫ్రిది తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో అఫ్రిది పాకిస్థాన్ సైన్యంతో మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు మరో పాకిస్థాన్ క్రికెటర్ వాఘా సరిహద్దుకు చేరుకుని పరిస్థితి తీవ్రతను పెంచాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు జునైద్ ఖాన్. భారత్-పాక్ బార్డర్ అయిన అటారీ-వాఘా సరిహద్దుకు జునైద్ ఖాన్ చేరుకున్నాడు. జునైన్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో జునైద్ ఖాన్ పాకిస్తాన్ జట్టు లోగో ఉన్న టీ-షర్టు ధరించి ఉన్నాడు. జునైద్ ఖాన్ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. "మిగిలిన వారు తెలివైనవారుగా ఉండాలి" అంటూ క్యాప్షన్ రాశాడు. జునైద్ ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. గతంలో తీసిన వీడియోను జునైద్ ఖాన్ పోస్ట్ చేశాడు. పహల్గాం దాడి జరిగిన అనంతరం ఈ వీడియోను పోస్ట్ చేయడం రెచ్చగొట్టే చర్యగా భావించవచ్చు. ఇటీవల చాలా మంది పాక్ క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

పాక్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన జునైద్ ఖాన్
పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ నుంచి జునైద్ ఖాన్ రిటైర్ అయ్యాడు. జునైద్ ఖాన్ పాకిస్థాన్ తరఫున 22 టెస్టులు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. జునైద్ ఖాన్ టెస్ట్ క్రికెట్లో మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా జునైద్ ఖాన్ వన్డేల్లో 110 వికెట్లు, టీ20ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
పాకిస్థాన్ క్రికెటర్లు భారత్పై బహిరంగంగా విషం కక్కడం ఇదే మొదటిసారి కాదు. ఈ కారణంగానే పాకిస్థాన్తో ద్వైపాక్షిక క్రికెట్ను బీసీసీఐ నిషేధించింది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ లు ఐసీసీ, ఆసియా కప్ ఈవెంట్లలో మాత్రమే జరుగుతున్నాయి.