మరో రెండు వారాల్లో అత్యంత ఆసక్తికరమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి మొదలుకానున్న ఈ అయిదు టెస్టుల సిరీస్ భారత్-ఆస్ట్రేలియా ఇరు జట్లకు కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్పై ఆధారపడి ఉన్నాయి. భారత్ కనీసం నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ముచ్చటగా మూడోసారి టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు చేరుతుంది.
మరోవైపు ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసమే కాకుండా పరువు కోసం పోరాడటానికి సిద్ధమైంది. 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే కైవసం చేసుకుంటుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారతే విజేత. ఈసారి తప్పక సిరీస్ కావాలని కసిగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో జరుగుతున్న వన్డే సిరీస్కు, జరగనున్న టీ20 సిరీస్కు కీలక ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) పక్కనపెట్టి, ప్రత్యేక సాధన చేయించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో పాకిస్థాన్తో సిరీస్లకు కొత్త కెప్టెన్ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాకిస్థాన్తో జరగనున్న మూడో వన్డేలకు, మూడు టీ20ల సిరీస్కు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ ఆసీస్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు 14వ టీ20 కెప్టెన్గా, 30వ వన్డే కెప్లెన్గా ఇంగ్లిస్ రికార్డులకెక్కనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దృష్ట్యా, ఇతరత్రా కారణాలతో టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ టీ20 సిరీస్తో పాటు వన్డే జట్టుకు ఎంపిక కాలేదు.
ఇక మూడో వన్డేకు ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, హేజిల్వుడ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆసీస్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. పాకిస్థాన్తో టీ20 సిరీస్కు గత వారంలోనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. అయితే సారథి లేకుండా జట్టు వివరాలు వెల్లడించింది. అనుభవజ్ఞుడు గ్లెన్ మాక్స్వెల్కు సారథి బాధ్యతలు ఇస్తారని భావించారంతా. కానీ జోష్ ఇంగ్లిస్ను కెప్టెన్గా నియమించింది.
పాకిస్థాన్ సిరీస్కు ఆస్ట్రేలియా టీ20 జట్టు: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.