ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో జోస్ హజిల్వుడ్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ అనేది పొట్టి క్రికెట్లో ప్రపంచ అత్యుత్తమ లీగ్. అందులో మెరుగైన ప్రత్యర్థులు ఎదురవుతారు. వారితో ఆడితే ఎంతో నేర్చుకోవచ్చు. కఠిన పరిస్థితులలో ఎలా ఆడాలో నేర్పిస్తుంది. ప్రతిఒక్క ఆటగాడి నుంచి ఎదో ఒక విషయం మనకు తెలుస్తుంది. క్రికెట్ క్యాలెండర్లో ఐపీఎల్కు కచ్చితంగా సమయం ఉండాలి. టీ20 లీగ్ల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు' అని అన్నాడు.
'కరోనా కారణంగా నాలుగు నెలలుగా మైదానంలోకి దిగలేదు. రోజు వ్యాయామం చేసి ఫిట్నెస్ కాపాడుకున్నా. టెస్ట్ క్రికెట్ కోసం రెండు వారాల వ్యవధిలో తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించడం చాలా కష్టం. గాడిలో పడడానికి నాకు గరిష్టంగా రెండు మ్యాచులు అవసరమని నేను భావిస్తున్నా' అని హజిల్వుడ్ పేర్కొన్నాడు. బయో సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఉల్లంఘించిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అందరికి ఓ ఉదాహరణగా నిలుస్తాడన్నాడు. క్రీడలు ముందుకు సాగడానికి అందరూ కఠినమైన మార్గదర్శకాలను పాటించాలన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ను ఐసీసీ వాయిదా వేయడంతో ఈ ఏడాది ఐపీఎల్-13వ సీజన్కు మార్గం సుగమమైంది. ప్రపంచకప్ వాయిదా పడుతుందని ముందుగానే అంచనా వేసిన బీసీసీఐ.. ఐపీఎల్ తేదీలు, వేదికను ఖరారు చేసింది. వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన ఈ ఏడాది సీజన్ను సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏ క్షణమైనా ఐపీఎల్ తేదీలు, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చని సమాచారం. అయితే ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్ 2020!!