
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో నిలకడగా రాణిస్తోన్న స్టార్ ప్లేయర్.. జోస్ బట్లర్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇన్నింగ్ను ఆరంభిస్తోన్న ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లకు చుక్కలు చూపుతున్నాడు. 2018 తరువాత ఈ స్థాయిలో బట్లర్.. బాంబుల్లాంటి షాట్లో విరుచుకుపడుతుండటం ఇదే తొలిసారి. ఈ స్థాయిలో బట్లర్ ఆడిన సీజన్లు తక్కువే. 2018లో సీజన్ మొత్తానికీ 548 పరుగులు చేయగా.. ఇప్పుడు 10 మ్యాచ్లల్లోనే ఆ స్కోర్ను దాటేశాడు. 588 రన్స్ చేశాడు.
లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్లను ఆడాల్సి ఉంది రాజస్థాన్ రాయల్స్. ఈ సాయంత్రం పంజాబ్ కింగ్స్తో తలపడుతోంది. అనంతరం ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్లను ఢీకొట్టాల్సి ఉంది. ఇప్పుడున్న దూకుడును జోస్ బట్లర్ కొనసాగించడమంటూ జరిగితే- రికార్డు స్థాయిలో పరుగులు చేయడం ఖాయం. ఇదివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డు చెదిరిపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

2016 సీజన్లో విరాట్ కోహ్లీ ఈ పరుగులు చేశాడు. ఆ సీజన్లో నాలుగు సెంచరీలు బాదాడు కింగ్ కోహ్లీ. 81.08 బ్యాటింగ్ యావరేజ్ను నమోదు చేశాడు. 113 అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్. నాలుగు సార్లు నాటౌట్గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ చెక్కుచెదరట్లేదు. ఈ స్థాయిలో మరే బ్యాటర్ కూడా పరుగులు చేయలేకపోతున్నాడు.. చివరికి విరాట్ కోహ్లీ సైతం దీన్ని బద్దలు కొట్టట్లేదు. ఇప్పుడీ రికార్డ్.. జోస్ బట్లర్ చేతుల్లో బదలయ్యే అవకాశం లేకపోలేదు. దీనికోసం బట్లర్ ఇంకో 385 పరుగులను చేయాల్సి ఉంది.
ఇవ్వాళ్టి మ్యాచ్తో కలుపుకొని ఇంకా నాలుగింట్లో ఆడాల్సి ఉన్నందున.. జోస్ బట్లర్ ఈ స్కోర్ చేయగలడనే ధీమా వ్యక్తమౌతోంది. లీగ్స్ను దాటుకుని రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్, ఫైనల్స్ వరకు వెళ్లగలిగితే విరాట్ కోహ్లీ రికార్డు ఉండకపోవచ్చు. టీమిండియా మాజీ ప్లేయర్, లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం.. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్.. ఫైనల్స్ వరకు వెళ్లగలిగితే జోస్ బట్లర్- విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు. కోహ్లీ రికార్డును చెరిపేసే శక్తి సామర్థ్యాలు ఒక్క బట్లర్కు మాత్రమే ఉన్నాయని అన్నారు. పిచ్లు కొంత నెమ్మదించినట్టు కనిపిస్తోందని, ఇది మ్యాచ్లను మరింత ఆసక్తికరంగా మార్చుతాయని చెప్పారు. ప్లేఆఫ్స్ ఉత్కంఠభరితంగా సాగుతాయని అన్నారు. ఇవ్వాళ్టి మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టొన్, రాజస్థాన్ బౌలర్ యజువేంద్ర చాహల్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.