
లండన్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో క్రీడాకారులు అందరూ తమవంతు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కరోనా బాధితుల సహాయార్థం ముందుకొచ్చాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తాను వేసుకున్న జెర్సీని వేలం వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు బట్లర్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు. జెర్సీని వేలం వేసి.. ఆ మొత్తాన్నికరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న లండన్లోని రెండు ఆస్పత్రులకు అందిస్తానని చెప్పారు.
'ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో నేను ధరించిన జెర్సీని వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్లోని రాయల్ బ్రాంప్టన్, హారెఫైడ్ ఆస్పత్రులకు అందిస్తాను. కోవిడ్-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులు తగినంత వైద్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటి వద్దే ఉండండి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయండి' అని బట్లర్ ట్విటర్లో పేర్కొన్నాడు. విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని వారికి మనవంతు సాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
మెరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా ఆస్పత్రుల వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. లార్డ్స్ మైదానంలో వారి వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే పలువురు ఇంగ్లీష్ క్రికెటర్లు కూడా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. యూకేలో ఇప్పటివరకు 25వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1500 మంది మృతి చెందారు.
2019 జులై 14న లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో.. సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇంగ్లండ్కు ఇదే తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీ కావడం విశేషం. ఇంగ్లండ్ కప్ గెలవడంతో జోస్ బట్లర్ కూడా కీలక పాత్ర పోషించాడు.