లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఇంగ్లండ్ వికెట్కీపర్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ ఎదిగేందుకు ఐపీఎల్ సహకరించిందన్నాడు. ఐసీసీ ప్రపంచకప్ల తర్వాత ఐపీఎల్ టోర్నీయే అత్యుత్తమంగా ఉంటుందని బట్లర్ అన్నాడు. 2016 నుండి ఐపీఎల్ ఆడుతున్న బట్లర్.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది టోర్నీ నిలిచిపోవడం బాధగా ఉందన్నాడు.
ఐపీఎల్ నిర్వహించాలనుకుంటే.. బీసీసీఐ కచ్చితంగా గెలుస్తుంది: ఇయాన్ ఛాపెల్
జోస్ బట్లర్ తాజాగా బీబీసీతో మాట్లాడుతూ ఐపీఎల్పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. 'ఇంగ్లండ్ క్రికెట్ ఎదుగుదలకు ఐపీఎల్ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతకొన్నేళ్లుగా ఇంగ్లీష్ ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్లో ఆడుతున్నారు, ఇదే నిదర్శనం. ఐపీఎల్ ఫాంటసీ క్రికెట్లా ఉంటుంది, అందులో నేను చిన్నపిల్లాడిలా ఆడాలనుకుంటున్నా. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మెగా టోర్నీ నిలిచిపోవడం బాధగా ఉంది' అని బట్లర్ అన్నాడు.
'ఐపీఎల్లో దిగ్గజ క్రికెటర్ల మధ్య పోటీ చూడటం చాలా బాగుంటుంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలను కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అత్యుత్తమ జట్లలో ఒకటి. అలాంటి ఆటగాళ్లు.. జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగాలను ఎదుర్కోవడం చూస్తే అద్భుతంగా ఉంటుంది. యువ క్రికెటర్లు ఇలాంటి ఫాంటసీ క్రికెటే ఆడాలనుకుంన్నారు' అని ఇంగ్లాండ్ కీపర్ పేర్కొన్నాడు. గత నాలుగేళ్లుగా బట్లర్.. ఐపీఎల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గురించి జోస్ బట్లర్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటం వెనక కెవిన్ పీటర్సన్ కృషి ఎంతో ఉంది. ఆయన వల్లే మా ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ జట్టుకు ఇతర సిరీస్లు లేకుండా పీటర్సన్ ఏర్పాట్లు చేశాడు. ఆటగాళ్లు మెరుగయ్యేందుకు ఐపీఎల్ ఎంతో ముఖ్యమని, దాన్ని తమ బోర్డుకు చాలా వివరంగా చెప్పి పీటర్సన్ ఒప్పించాడు. పీటర్సన్ కృషివల్లే ఇప్పుడు మేము మెగా ఈవెంట్లో ఆడగలుగుతున్నాం' అని చెప్పుకొచ్చాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ గత 12 ఎడిషన్ల పాటు నిరాటంకంగా సాగింది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది.