
లీడ్స్: తొలి టీ20లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్.. తిరిగి పుంజుకొని లెక్క సరిచేసింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్ 45 పరుగులతో గెలుపొందింది. 2001 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే చేసింది. పాక్ ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఇంగ్లీష్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది. మంగళవారం చివరి టీ20 జరగనుంది.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జేసన్ రాయ్ (10), స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ (1) విఫలమయినా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (59; 39 బంతుల్లో 7×4, 2×6) చెలరేగాడు. అతడికి మొయిన్ అలీ (36; 16 బంతుల్లో 6×4, 1×6) సహరించాడు. ఈ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ కోలుకుంది. అలీ ఔట్ అయినా.. లియామ్ లివింగ్స్టన్ (38; 23 బంతుల్లో 2×4, 3×6) అండతో మరోమంచి భాగస్వామ్యం నెలకొల్పాడు అలీ. దీంతో ఇంగ్లండ్ 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్ మహ్మద్ హస్నైన్ మూడు వికెట్లు తీశాడు. పాక్ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
భారీ ఛేదనలో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 రన్స్కే పరిమితమైంది. పాకిస్తాన్కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు మొహ్మద్ రిజ్వాన్ (37), బాబర్ ఆజామ్ (22) దూకుడుగా ఆడాడు. వేగంగా ఆడుతూ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకోవడంతో పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ ఓటమి ముందే ఖరారైంది. ఇమాద్ వసీం (20), షాదాబ్ ఖాన్ (36 నాటౌట్) రాణించినా.. పరుగుల అంతరం మాత్రమే తగ్గింది. సకీబ్ మహమూద్ 3.. మొయిన్ అలీ, రషీద్ చెరో 2 వికెట్లు తీశారు.