ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో కంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణా ఎంట్రీ ఇవ్వడం వివాః)దస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై మ్యాచ్ జరిగిన రోజే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఐదో మ్యాచ్ లోనూ ఇదే విషయాన్ని టాస్ సమయంలో పరోక్షంగా లేవనెత్తి సెటైరికల్ కామెంట్స్ చేశాడు జోస్ బట్లర్. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి.
టాస్ సమయంలో జట్టు కూర్పు గురించి మాట్లాడిన జోస్ బట్లర్ ఈ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. సాధారణంగా సబ్స్టిట్యూట్లను తీసుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ల వీరే అని చెబుతుంటారు. కానీ జోస్ బట్లర్ మాత్రం.. సకీబ్ మహమూద్ ప్లేస్ లో మార్క్ వుడ్ను తీసుకున్నట్లు చెబుతూనే.. 'ఇంపాక్ట్ సబ్స్' వీరేనంటూ మిగతా నలుగురి పేర్లను నొక్కి చెప్పాడు. దీంతో అతడు హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ వివాదాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించినట్లు అర్థమవుతోందని క్రికెట్ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. 'నలుగురు కాదు 15 మంది వెంట తెచ్చుకున్నా నువ్వు చేసేదేమి లేదు', 'మళ్లీ ఏడవడం మొదలు పెట్టారురా' అని విమర్శిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?
పుణె వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో శివమ్ దూబె కంకషన్ కు గురయ్యాడు. దీంతో కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణా తీసుకున్నారు. ఈ మ్యాచ్ తోనే అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వచ్చీ రాగానే అతడు చెలరేగి.. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ వివాదం చెలరేగింది. పలువురు మాజీ క్రికెటర్లు కూడా స్పందించేలా తీవ్ర చర్చకు కూడా దారితీసింది.