టీమిండియాపై వరుస ఓటములతో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను చేజార్చుకుంది ఇంగ్లాండ్. తాజాగా జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ పై ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. అయితే సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న ఇంగ్లాండ్ కు తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ గాయపడ్డాడు. దీంతో ఇప్పటికే రెండో వన్డేకు దూరమైన అతడు.. ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జాకబ్ బెథెల్ గాయపడ్డాడు. ఇది అతడికి నిజంగా బాధ కలిగించే విషయం. ఎదురు దెబ్బ లాంటిది. అతడు గొప్ప ఆటగాడు. గాయం వల్ల అతడు ఆటకు దూరమవ్వడం బాధకరమైన విషయం " అని పేర్కొన్నాడు. కాగా, తొడకండరాల గాయంతో జాకబ్ భాదపడుతున్నట్లు సమాచారం అందింది.

జాకబ్.. నాగ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయినప్పటికి అతడు మంచి ప్రదర్శనే చేశాడు. బ్యాట్ తో పాటు బౌలింగ్ లోనూ పర్వాలేదనిపించాడు. 64 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు. బౌలింగ్లో మూడు ఓవర్లు వేసి, 18 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు తమ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. అనంతరం ఫిబ్రవరి 26న అఫ్గానిస్థాన్తో పోటీపడనుంది. ఆ తర్వాత మార్చి 1న దక్షిణాఫ్రికాతో ఢీ కొననుంది. ఇకపోతే ఫిబ్రవరి 12లోగా.. ఇప్పటికే ప్రకటించిన జట్లలో మార్పులు చేసుకునేందుకు టోర్నీలో పాల్గొనే దేశాలకు అవకాశం ఉంది.