
లండన్: డబుల్ సెంచరీ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు అతడు. అదే ఆనందంలో అభిమానులతో కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగాడు. అలా చేయడమే అతనికి శాపంగా మారింది. దీని కారణంగా అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించిందా జట్టు యాజమాన్యం. ఈ ఘటన బ్రిటన్ కౌంటీ క్రికెట్లో జరిగింది. ఒక్కోసారి అరటిపండు తిన్నా కూడా పన్ను విరుగుతుంది. ఈ సామెతే ఇక్కడ జరిగట్టుంది.
కెంట్ జట్టుకు చెందిన బ్యాట్స్మెన్ జోర్డన్ కాక్స్.. బాబ్ విల్లీస్ ట్రోఫీ మ్యాచ్లో ససెక్స్ టీమ్పై 238 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ మ్యాచ్లో కాక్స్ కోవిడ్-19 నియమావళిని ఉల్లంఘించాడు. డబుల్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన 19 ఏళ్ల కాక్స్.. ఆ ఆనందంలో స్టేడియంలో ఓ అభిమానితో సెల్ఫీ దిగాడు. ఈ విషయం తెలిసిన జట్టు యాజమాన్యం జోర్డాన్పై ఆగ్రహించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని విధించిన నిబంధనలను అతను ఉల్లంఘించాడని అసంతృప్తి వ్యక్తం చేసింది.
బయో సెక్యూర్, సోషల్ డిస్టాన్సింగ్ నియమావళిని 19 ఏళ్ల జోర్డన్ కాక్స్ ఉల్లంఘించినట్లు టీమ్ యాజమాన్యం చెప్పింది. దీంతో అతన్ని మిడిల్సెక్స్తో జరిగే మ్యాచ్కు దూరం పెట్టారు. అయితే కోవిడ్19 పరీక్షలో నెగటివ్ వస్తేనే, తిరిగి జోర్డన్ కాక్స్ను జట్టులోకి తీసుకోనున్నారు. ఈ ఘటన పట్ల కాక్స్ క్షమాపణలు చెప్పారు. తాను తప్పు చేశానని, జట్టు నమ్మకాన్ని వమ్ము చేసినట్లు భావిస్తున్నానని చెప్పి క్షమాపణ కోరాడు.
జోర్డన్ కాక్స్ మంచి క్రికెటర్ కానీ అతను ప్రోటోకాల్ బ్రేక్ చేశాడని, అతను కచ్చితంగా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లాల్సిందే అని డైరక్టర్ పౌల్ డౌన్టౌన్ తెలిపారు. బాబ్ విల్లీస్ ట్రోఫీలో భాగంగా మిడిలెసెక్స్తో జరిగే తర్వాతి మ్యాచ్లో పాల్గొనకుండా జోర్డాన్పై నిషేధం విధించి ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ ఆటలో తాత్కాలిక నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.