
హైదరాబాద్: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్స్ ప్యానెల్ (ఏడీఏపీ)లో చేరడం తనకు ఇష్టం లేదని కానీ, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కోరిక మేరకే చేరానని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
నాడా గత నవంబరులో వీరేంద్ర సెహ్వాగ్కు యాంటీ డోపింగ్ అప్పీల్స్ ప్యానెల్ (ఏడీఏపీ)లో చోటు కల్పించింది. ఆటగాళ్ల నిషేధంపై చేసుకున్న అప్పీల్ను ఈ ప్యానెల్ విచారిస్తుంది. ఇప్పటివరకు పలువురి అప్పీళ్లను విచారించినప్పటికీ ఒక్క విచారణకు సెహ్వాగ్ హాజరు కాలేదు.
దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ఈ ప్యానెల్లో ఉండడంలో ప్రయోజనమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో తనపై వచ్చిన వార్తలకు గాను సెహ్వాగ్ వివరణ ఇచ్చాడు. "ఈ ప్యానెల్లో చేరడం నాకు ఇష్టం లేదు. క్రికెటర్ల కంటే మాజీ ఒలింపియన్లే ఇందులో సభ్యులుగా ఉండాలని నా అభిప్రాయం" అని సెహ్వాగ్ అన్నాడు.
"డోపింగ్ నిరోధక అంశాలు నాకంటే ఒలింపియన్లకే బాగా తెలుసు. నాకు ఈ పదవిపై ఇష్టమే లేదు. కానీ క్రీడల మంత్రి కోరడంతో అంగీకరించాను. ప్యానెల్ తొలి రెండు సమావేశాల గురించి సమాచారం లేదు. మూడో సమావేశం గురించి చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆ రోజు మా అబ్బాయి ఆరోగ్యం సరిగా లేదు. అందుకే హాజరుకాలేకపోయాను'' అని సెహ్వాగ్ వివరించాడు.
కాగా, జస్టిస్ ఆర్.వి.ఈశ్వర్ నేతృత్వంలోని ఈ కమిటీలో సెహ్వాగ్తో పాటు అడ్వొకేట్ విభా దత్త, ఢిల్లీ మాజీ కెప్టెన్ వినయ్ లంబ, డాక్టర్ నవీన్ దంగ్, డాక్టర్ హర్ష్ మహాజన్ ఇతర సభ్యులుగా ఉన్నారు. తాజాగా, ఆగస్టు నెల 10, 14, 23 తేదీల్లో ఈ ప్యానెల్ విచారణ చేపట్టనుంది.