ఐపీఎల్-2024 సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ కర్ణాటకలో సందడి చేస్తున్నాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోషియేషన్ తరఫున ఆర్చర్ ఓ మ్యాచ్లో బరిలోకి దిగాడు. వికెట్ సాధించి కర్ణాటక ప్లేయర్లతో సంబరాలు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో ఆర్చర్ గాయపడిన విషయం తెలిసిందే. గత మే నెల నుంచి అతడు క్రికెట్కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చేందకు సిద్ధమవుతన్నాడు.
ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్ వేలంలో కూడా తన పేరును నమోదు చేసుకోలేదు. 2022లో ముంబై ఇండియన్స్ ఆర్చర్ను రూ.8 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ 2022 సీజన్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2023లో నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మోచేతి గాయంతో లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. ఆ తర్వాత వేలానికి ముందు ఆర్చర్ను ముంబై ఇండియన్స్ వదులుకుంది. కానీ ఆర్చర్ ఐపీఎల్ వేలంలో పాల్గొనలేదు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్ తొలుత రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. కానీ ఇండియాకు వచ్చిన అతడు టోర్నీ మధ్యలోనే తిరిగి ఇంగ్లండ్కు వెళ్లాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో కూడా ఆర్చర్ ఎంపిక కాలేదు. అయితే ఈ క్రమంలో ఆర్చర్ ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన ఆర్చర్ ససెక్స్ జట్టు తరఫున తిరిగి పోటీ క్రికెట్ ఆడనున్నాడు.
మరోవైపు కౌంటీ ఛాంపియన్షిప్ సన్నద్ధతలో భాగంగా ససెక్స్ జట్టు ప్రీసీజన్ టూర్ కోసం ఇటీవల బెంగళూరుకు వచ్చింది. ఆ జట్టులో కలిసి ఆర్చర్ ఇండియాకు వచ్చాడు. అయితే అలూర్లో కర్ణాటక-ససెక్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్చర్ కర్ణాటక XI జట్టు తరఫున బరిలోకి దిగాడు. తమ జట్టు తరఫున కాకుండా కర్ణాటక కోసం ఆర్చర్ ఆడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ మునపటిలా వేగంగా ఆర్చర్ బంతులు విసురుతున్నాడు.
వికెట్ల వేట మొదలుపెట్టాడు. కాగా, ఏప్రిల్ 5 నుంచి కౌంటీ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు ప్రత్యర్థి జట్లకు సవాళ్లు విసరడానికి ఆర్చర్ సిద్ధంగా ఉన్నాడు.