
షార్జా: షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్లు శివాలెత్తారు. ముందుగా యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (74; 32 బంతుల్లో 1x4, 9x6) వీరవిహారం చేశాడు. సిక్సులే లక్ష్యంగా ఆడాడు. చెన్నై పేస్, స్పిన్ బౌలర్లపై విరుచుపడి ఏకంగా 9 సిక్సులు బాదాడు. ఆపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ (69; 47 బంతుల్లో 4x4, 4x6) బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో పేసర్ జోఫ్రా ఆర్చర్ మూడు వరుస సిక్సులు బాదాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 216 రన్స్ చేసి.. చెన్నైకి 217 పరుగుల భారీ టార్గెట్ విధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్, యువబ్యాట్స్మన్ యశస్వి జైస్వాల్ (6) త్వరగానే పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్లోనే దీపక్ చాహర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. చెన్నై బౌలర్లపై ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు. ఏ మాత్రం కనికరం లేకుండా సిక్సుల వర్షం కురిపించాడు. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్నంతలా చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్లతో హాఫ్ సెంచరీ బాదాడు.
రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు సంజూ శాంసన్. దాంతో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లాను రంగంలోకి దించినా.. లాభం లేకపోయింది. ఎనిమిదో ఓవర్లో నాలుగు భారీ సిక్స్లు కొట్టాడు. దీంతో టీ20 మ్యాచ్లో తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో అభిమానులకు రుచిచూపెట్టాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్తో కలిసి అతడు రెండో వికెట్కు 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ వైపు వెళ్తున్న సంజూని లుంగీ ఎంగిడి ఔట్ చేశాడు. భారీ సిక్సర్ కొట్టబోయి చహర్ చేతికి చిక్కాడు.
సంజూ పెవిలియన్ చేరిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పుంజుకున్న చెన్నై బౌలర్లు మిడిలార్డర్ను కుప్పకూల్చారు. దీంతో స్టీవ్ స్మిత్కు సహకరించే బ్యాట్స్మన్ కరవయ్యారు. అయితే స్మిత్ (69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయి అర్ధ శతకం చేశాడు. చివరికి 69 పరుగుల చేశాక.. సామ్ కరన్ బౌలింగ్లో కేదార్ జాధవ్కు చిక్కాడు. ఇక్కడే రాజస్థాన్ బ్యాటింగ్ ఊపందుకుంది.
చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ (27; 8 బంతుల్లో 4x6) లుంగి ఎంగిడీకి పీడకల మిగిల్చాడు. వరుసగా నాలుగు భారీ సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో మొత్తం 30 పరుగులు రావడంతో.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బౌలర్లలో శామ్ కరన్ మూడు వికెట్లు తీయగా..దీపక్ చాహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు.