
చెన్నై: తాను మళ్లీ టీ20 క్రికెట్ ఆడాలనుకుంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అన్నాడు. మూడు ఫార్మాట్లలో బరిలోకి దిగడాన్ని ఇష్టపడతానని, ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. నిరుడు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సెలక్టర్లు తనను విస్మరించినా.. రూట్కు పొట్టి ఫార్మాట్పై ఇంకా ఆశలు పోలేదు. నాలుగు టెస్ట్ సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి చెన్నైలో ఇంగ్లండ్తో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
తాజాగా జో రూట్ మాట్లాడుతూ... '2021 ప్రపంచకప్కు ఇంగ్లండ్ అత్యంత బలమైన జట్టుతో వెళ్లడం, కప్పు గెలవడానికి అత్యుత్తమ అవకాశం సృష్టించుకోవడం నాకు అత్యంత ముఖ్యం. జట్టులో నేను కూడా ఉంటానని ఆశిస్తున్నా. ఒకవేళ జట్టులో లేకుంటే.. ఉన్న వాళ్లకు మద్దతుగా ఉంటా. ఎందుకంటే ఇప్పటికే వన్డే ప్రపంచకప్ గెలిచిన మేం.. ఇది కూడా గెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది. అభిమానులు ఎంతో సంతోషిస్తారు' అని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ అక్టోబరు-నవంబరులో భారత్లో జరగనుంది.
ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లో జో రూట్ ఒకడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీలతో పోటీపడి మరి పరుగులు చేస్తున్నాడు. అయితే రూట్ ఇప్పటివరకు 32 టీ20ల్లో 126.3 స్ట్రైక్రేట్తో 893 పరుగులు చేశాడు. 'నేను ప్రపంచకప్ జట్టులో ఉండాలని బలంగా కోరుకుంటున్నా. అన్ని ఫార్మాట్లూ ఆడడం నాకిష్టం. ప్రతి ఫార్మాట్ భిన్నమైన సవాలును విసురుతుంది. గత కొన్నేళ్లలో నాకు పెద్దగా టీ20 క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లీష్ టీ20 జట్టులో ఉన్న వాళ్లు చాలా గొప్పగా ఆడుతున్నారు. జట్టులో ఉండేందుకు వాళ్లు పూర్తి అర్హులు' అని జో రూట్ చెప్పాడు.
టెస్ట్ కెప్టెన్గా జట్టును గొప్పగా నడిపించడంతో పాటు బ్యాట్స్మన్గా పరుగుల వరద పారిస్తున్న జో రూట్.. ఇంగ్లండ్కు ప్రధాన బలం అనడంలో సందేహం లేదు. ఇటీవల శ్రీలంకతో రెండు టెస్టుల్లోనూ బ్యాట్తో సత్తా చాటాడు. తొలి టెస్టులో ద్విశతకం బాదిన జో.. రెండో మ్యాచ్లో భారీ సెంచరీ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియాపైనా అతనికి మంచి రికార్డు ఉంది. 16 టెస్టుల్లో 56.84 సగటుతో 1421 పరుగులు చేశాడు. అందులో 4 శతకాలు, 9 అర్ధ శతకాలున్నాయి. స్పిన్ను చక్కగా ఆడే రూట్.. భారత్లో 6 టెస్టులాడి 53.09 సగటుతో 584 పరుగులు చేశాడు.