
హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల రికార్డుని జో రూట్ సమం చేశాడు. అదేంటి జో రూట్ బ్యాట్స్మన్ కదా... బౌలింగ్లో చెత్త రికార్డు ఏంటని అనుకుంటున్నారా?
అవును... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో జో రూట్ బౌలింగ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలరైన జో రూట్ మ్యాచ్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం అద్భుత ప్రదర్శన చేశాడు. 4/31తో తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఫలితంగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ జో రూట్ బౌలింగ్ గురించే చర్చించుకున్నారు.
ఆటలో భాగంగా ఆఖరు రోజు జో రూట్ తన బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో జో రూట్ బౌలింగ్లో ఒక ఓవర్లో సపారీ బ్యాట్స్మెన్ 28 పరుగులు(444664b) రాబట్టారు. ఫలితంగా టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా జో రూట్ నిలిచాడు.
టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో బ్రియాన్ లారా, జార్జి బెయిలీ, కేశవ్ మహారాజ్లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వీరి సరసన జో రూట్ నిలిచాడు. వీరంతా కూడా ఒకే ఓవర్లో 28 పరుగులు సమర్పించుకున్నారు.
2003/04లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో బ్రియానా లారా 28 పరుగులు(466444) సమర్పించుకోగా... 2013/14లో జరిగిన ఓ టెస్టులో జార్జి బెయిలీ 28 పరుగులు(462466), 2019/20లో పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేశవ్ మహారాజ్ 28 పరుగులు(444664b) సమర్పించుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే, మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 102/6 ఓవర్నైట్ స్కోరుతో ఐదవ రోజు సోమవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 88.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.
విదేశాల్లో ఇది ఇంగ్లండ్కు 150వ టెస్ట్ విజయం కావడం విశేషం. జో రూట్కు తోడు మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయడంతో సపారీలు కోలుకోలేకపోయారు. ఫిలాండర్ (13), రబడ (16), నొర్జే (5), మహారాజ్ (71) చివరి రోజు పెవిలియన్ చేరారు. కెప్టెన్ డుప్లెసిస్ (36), మహారాజ్ (71) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు నష్టపోయి 499 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సఫారీలు 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 88.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన ఒలీ పోప్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి 24 నుంచి జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది.