సౌతాంప్టన్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో బబుల్ వాతావరణంలో ఇంగ్లండ్-ఐర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ అలవోకగా విజయం సాధించింది. అయితే రాయల్ లండన్ సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరగనున్న మిగతా రెండు వన్డేలకు ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జో డెన్లీ దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా సిరీస్ నుండి అతడు తప్పుకున్నాడు.
జో డెన్లీ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లండ్ 14 మంది సభ్యుల జట్టుతో కలవనున్నాడు. బుధవారం ట్రైనింగ్ సమయంలో డెన్లీకి గాయం కావడంతో అతడు తొలి వన్డేలో కూడా ఆడలేదు. వెన్నునొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈసీబీ అతని స్థానంలో లివింగ్స్టోన్ను ఎంపిక చేసింది. వన్డేల్లో ఆరంగేట్రం చేయడానికి లివింగ్స్టోన్కు ఇదే సరైన అవకాశం. 26 ఏళ్ల లివింగ్స్టోన్ ఇంగ్లండ్ తరఫున కేవలం రెండు టీ20లు మాత్రమే ఆడాడు. 4 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.
ప్రపంచకప్ సూపర్ లీగ్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్ను 44.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. లక్ష్యాన్ని 27.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సామ్ బిల్లింగ్స్ (67 నాటౌట్; 54 బంతుల్లో 11×4), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (36 నాటౌట్; 40 బంతుల్లో 4×4, 2×6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో ఒక దశలో 78 పరుగులకే 4 వికెట్లు పడినా.. ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన ఈ జోడీ ఐదో వికెట్కు 96 పరుగులు చేసి ఇంగ్లండ్ను గెలుపు తీరాలకు చేర్చింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐరీష్ జట్టును పేసర్ డేవిడ్ విల్లీ (5/30) వణికించాడు. అతను తన తొలి నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే స్టిర్లింగ్ (2)ను ఔట్ చేసిన విల్లీ.. ఆ తర్వాత కెప్టెన్ బాల్ బిర్నీ (3) వికెట్నూ ఖాతాలో వేసుకున్నాడు. విల్లీతో పాటు మహ్మద్ (2/36) కూడా విజృంభించడంతో ఒక దశలో ఐర్లాండ్ 26 పరుగుల తేడాతో మూడు వికెట్లు నష్టపోయి 28/5తో కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ స్థితిలో 21 ఏళ్ల కాంఫెర్ (59 నాటౌట్; 118 బంతుల్లో 4×4), కెవిన్ ఒబ్రైన్ (22)తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నించాడు. కానీ ఒబ్రైన్ను రషీద్ ఔట్ చేయడం.. సిమిసింగ్ (0) రనౌట్ కావడంతో ఐర్లాండ్ 79/7తో నిలిచింది. కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించిన దశలో కాంఫెర్, మెక్బ్రిన్ (40) తోడుగా ఎనిమిదో వికెట్కు 66 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే శనివారం జరగనుంది.
కోచ్ లేని లోటును ఎంఎస్ ధోనీ తీర్చేవాడు: కుల్దీప్