
హైదరాబాద్: ప్రపంచ క్రికెట్ను కొన్ని ఏళ్ల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో శాసించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం పేలవ ప్రదర్శనను కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీమిండియా చేతిలో సొంతగడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను సైతం చేజార్చుకుంది. తాజాగా ఆ జట్టు ఓ టెస్టు సెంచరీ చేసేందుకు దాదాపు 113 రోజులు ఎదురు చూసింది.
అవును... భారత్తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియన్లు ఎనిమిది ఇన్నింగ్స్ల్లో కలిపి కనీసం ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయారు. మరోవైపు అదే సిరీస్లో పుజారా రెండు, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ చెరో సెంచరీ నమోదు చేశారు. దీంతో టీమిండియా 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టెస్టు సిరీస్ని గెలిచింది.
సొంత గడ్డపై భారత్ చేతిలో టెస్టు సిరిస్ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఎట్టకేలకి మళ్లీ పుంజుకుంది. శ్రీలంకతో కాన్బెర్రా వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో ఆజట్టు బ్యాట్స్మెన్ జో బర్న్స్(172 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(161) భారీ సెంచరీతో చెలరేగారు. అక్టోబరు, 2018లో చివరగా టెస్టుల్లో ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా తరఫున సెంచరీ సాధించాడు.
ఆ తర్వాత మళ్లీ భారత్పై ట్రావిస్ హెడ్ చేసిన 84 పరుగులే ఆ జట్టు తరఫున టెస్టుల్లో అత్యధికం. తొలిరోజే ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి 4 వికెట్లకు 384 పరుగులు చేసింది. దీంతో టెస్టుల్లో ఒక సెంచరీ పూర్తి చేయడానికి ఆస్ట్రేలియా 113 రోజుల సమయం తీసుకుంది.