ప్రపంచంలో అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా ఈ లీగ్లో కాసుల వర్షం కురుస్తుంది. ఈ లీగ్కు భారత్లో ఎంత పాపులారిటీ ఉందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది వరకు హాట్స్టార్కు వినియోగదారులు భారీగా పెరగడానికి కారణం కూడా ఐపీఎల్ అనడంలో అతిశయోక్తి లేదు.
ఐపీఎల్ డీటీహెచ్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో వస్తుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ అంతా హాట్స్టార్లో జరుగుతుంది. ఐపీఎల్ సమయంలో హాట్స్టార్ సబ్స్క్రయిబర్ల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఈసారి ఈ పరిస్థితి మారిపోనుంది. ఎందుకంటే గతేడాది జరిగిన స్ట్రీమింగ్ రైట్స్ వేలంలో డీటీహెచ్ ప్రసారాల హక్కులను స్టార్ దక్కించుకోగా.. ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను మాత్రం రిలయన్స్కు చెందిన వయాకామ్18 దక్కించుకుంది. దీనికోసం ఏకంగా రూ.23,758 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది నుంచి 2027 వరకు ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు వయాకామ్18 వద్దనే ఉండనున్నాయి.
ఈ సంస్థ ఇటీవల ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను కూడా కొనుగోలు చేసింది. ఈ టోర్నీని స్పోర్ట్స్ 18 ఛానెల్లో ప్రసారం చేయడంతోపాటు 'జియో సినిమాస్' యాప్లో ఉచితంగా స్ట్రీమింగ్ చేసింది. ఈ పద్దతి సక్సెస్ కావడంతో ఐపీఎల్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేయాలని వయాకామ్18 అనుకుంటోందట.
వచ్చే ఏడాది ఐపీఎల్ మొత్తాన్ని 'జియో సినిమాస్' యాప్లో ఉచితంగా స్ట్రీమ్ చేయాలని భావిస్తోందట. తద్వారా డీటీహెచ్ హక్కులు కొనుగోలు చేసిన స్టార్కు చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ వార్త తెలిసిన క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో కొత్తగా చేరిన రెండు జట్లతో కలిసి మొత్తం పది జట్లు అయిన సంగతి తెలిసిందే. ఈ జట్లన్నీ ఒక్కోటీ 18 మ్యాచులు ఆడనున్నాయి. ఒకటి హోం గ్రౌండ్లో, మరొకటి ఎవే గ్రౌండ్లో ఆడతాయి.