
లక్నో: దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్లతో గెలుపొందింది. 158 పరుగుల లక్ష్యాన్ని మిథాలీ సేన 28.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (80 నాటౌట్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మహిళలు మొదటగా బ్యాటింగ్ చేశారు. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి (10-0-42-4) నాలుగు వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. లారా గుడాల్ (49) టాప్ స్కోరర్. కెప్టెన్ సునే లూస్ 36 పరుగులతో రాణించింది. లీ, డుఫ్రీజ్, కప్, చెట్టి పూర్తిగా విఫలమయ్యారు. భారత మరో సీమర్ మానసి జోషీ (2/23), స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ (3/37) ప్రత్యర్థి కోలుకోకుండా దెబ్బతీశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన (80 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. పూనమ్ రౌత్ (62 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 28.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జెమిమా రోడ్రిగ్స్ (9) త్వరగానే పెవిలియన్ చేరినా.. మంధాన, పూనమ్ మరో వికెట్ పడకుండా ఆడుతూ సునాయాస విజయాన్ని కట్టబెట్టారు. ఇద్దరూ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. ప్రొటీస్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఒక వికెట్ తీసింది.
ఏడాదికి పైగా విరామం తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయంపాలైన విషయం తెలిసిందే. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది. మిథాలీ రాజ్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. హర్మన్ప్రీత్ కౌర్ 40 పరుగులతో రాణించింది. స్వల్ప లక్ష్య ఛేదనను ప్రొటీస్ 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. శుక్రవారం మూడో వన్డే జరుగనుంది.