
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో జార్ఖండ్ జట్టు అరుదైన ఘతన సాధించింది. 85 సంవత్సరాల రంజీ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ గెలిచిన ఏకైక జట్టుగా జార్ఖండ్ చరిత్ర సృష్టించింది. 2019-20 రంజీ సీజన్ గ్రూప్ సి మ్యాచ్లో భాగంగా జార్ఖండ్-త్రిపుర జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి జార్ఖండ్ జట్టు తొలుత త్రిపుర జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో త్రిపుర తన తొలి ఇన్నింగ్స్లో 289 పరుగులు చేసి ఆలౌటైంది. త్రిపుర కెప్టన్ మిలింద్(59), హర్మీత్ సింగ్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. జార్ఖండ్ జట్టులో అజయ్ యాదవ్, ఆశిష్ కుమార్ తలో మూడు వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్ రెండు, వివేక్ తివారిలకు ఒక వికెట్ లభించింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన జార్ఖండ్ జట్టు 136 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో త్రిపురకు 153 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. అయినప్పటికీ త్రిపుర కెప్టెన్ మిలింద్ కుమార్ జార్ఖండ్ జట్టుని ఫాలో ఆన్కు ఆహ్వానించాడు.
అయితే, ఫాలో ఆన్లో జార్ఖండ్ జట్టు చెలరేగిపోయింది. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్మన్ సౌరబ్ తివారీ(190 బంతుల్లో 122, 8 ఫోర్లు), ఇషాంక్ జగ్గీ(207 బంతుల్లో 107, 9 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్ను జార్ఖండ్ 418/8 వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన త్రిపుర 211 పరుగులకే ఆలౌటైంది. త్రిపుర జట్టులో మురా సింగ్(103) సెంచరీ రాణించగా... మిగతా వారంతా నిరాశపరిచారు. రెండో ఇన్నింగ్స్లో జార్ఖండ్ బౌలర్ ఆశిష్ కుమార్ ఐదు వికెట్లతో త్రిపుర ఓటమిని శాసించాడు. ఈ మ్యాచ్ ఫలితం కోసం ఆఖరి ఓవర్ వరకు రావడం విశేషం.
ఆశిష్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో త్రిపుర బ్యాట్స్మన్ రానా దత్తా ఎల్బీగా వెనుదిరగడంతో జార్ఖండ్ విజయం సాధించింది. ఫలితంగా 85 ఏళ్ల రంజీ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన ఏకైక జట్టుగా జార్ఖండ్ చరిత్ర సృష్టించింది.