ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నూతన కార్యవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అపెక్స్ కౌన్సిల్ మూకుమ్మడి రాజీనామా చేసింది.
ఇక ఈ నెల విజయవాడలో జరగబోయే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గంపై చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. అదే రోజున ఏసీఏ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. శరత్ చంద్రారెడ్డి వర్గం మూకుమ్మడి రాజీనామా చేయడంతో వారి రాజీనామాలను ఆమోదించడం జరుగుతుంది. రాజీనామాకంటే ముందు తమ అస్మదీయులైన కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, తమకోసమే పనిచేసిన సిబ్బందికి భారీగా జీతాల పెంపు, కొత్త ఉద్యోగుల నియామకాలను సైలైంట్గా చేశారని కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి పై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ-జనసేన నాయకులు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మంత్రాంగం సాగిస్తున్నారు. అయితే పలువురు ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ఏసీఏ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడితో పాటు, తూర్పు గోదావరికి చెందిన ఓ నాయకుడు కూడా ఏసీఏ పీఠంపై కూర్చోవాలని బలంగా పావులు కదుపుతున్నారు.
అయితే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి మాత్రం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ రెడ్డి ధోనీకి అదే సమయంలో విరాట్ కోహ్లీతో మంచి సంబంధాలున్నాయి. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్తో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ రెడ్డికి ఆంధ్రా అసోసియేషన్ పగ్గాలు అప్పజెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది.