
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ జయ్దేవ్ ఉనద్కత్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్ లభించక బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కరోనాపై పోరులో భాగంగా తన వంతు సాయంగా ఐపీఎల్లో తన జీతంలో 10 శాతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఉనద్కత్ ప్రకటించాడు.
వైద్య సదుపాయాలు, అత్యవసరాలు కోసం తన ఐపీఎల్ శాలరీలో 10 శాతం విరాళంగా ఇవ్వనున్నట్లు జయదవ్ ఉనద్కత్ ప్రకటించాడు. ఉనద్కత్ ఐపీఎల్ శాలరీ 8 కోట్ల 40 లక్షలు కాగా.. అందులో 10 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్వీటర్లో విడుదల చేశాడు. 'విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారికి అవసరమైన వైద్య వనరులను అందించడానికి నా ఐపీఎల్ జీతంలో 10 శాతాన్ని సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ఈ విరాళాన్ని నా కుటుంబసభ్యులు అందిస్తారు' అని తెలిపాడు.
'ఈ సమయంలో క్రికెట్ ఆడటం మంచిదా?.. కాదా? అనే విషయం నేను చెప్పలేను. అయితే ప్రస్తుతం కుటుంబాలకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉది. ఐపీఎల్ 2021తో ప్రజలకు కొంతవరకూ అయినా ఎంజాయ్మెంట్ దొరకుతుందనే అనుకుంటున్నా. మనమంతా ఒకరికోసం ఒకరు ఐక్యంగా ఉండాలి. కరోనాతో బలంగా పోరాడటమే మనముందున్న కర్తవ్యం. ఈ పరిస్థితుల్లో మనకు చేతనైన సాయం చేయడం మనధర్మం' అని జయ్దేవ్ ఉనద్కత్ తన వీడియోలో పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కూడా కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ 7.5 కోట్లు విరాళంగా ఇచ్చింది.
ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ ఔదర్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్ కమిన్స్ ( 50 వేల డాలర్లు), సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి (రూ. 90 వేలు), ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ (ఒక బిట్ కాయిన్) తదితరులు సాయం చేసిన వారిలో ఉన్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన వంతు సాయం అందించిన విషయం తెలిసిందే.