
ముంబై: ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం కావడంతో అతనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిని పూర్తి చేసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. అశ్విన్ స్థానంలో మరో స్పిన్నర్ను ఎంపిక చేసింది. అతణ్ని లండన్కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్టాండ్బై స్పిన్నర్ను ఎంపిక చేసింది. అతన్ని ఎంపిక చేయడానికి ముందు టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయాన్ని సైతం తీసుకుంది. రోహిత్ శర్మ సలహాతోనే ఆ స్పిన్నర్ను సెలెక్ట్ చేశారని సమాచారం.
అతనే- జయంత్ యాదవ్. హర్యానాకు చెందిన లెగ్ స్పిన్నర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2022లో గుజరాత్ లయన్స్కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. 2015లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. 2021 వరకు మొత్తం 19 మ్యాచ్లు ఆడాడు. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున ఆరు టెస్ట్ మ్యాచ్లను ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈ ఆరింట్లో 16 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్.. 4/49. రెండు వన్డే ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు గానీ ఒక్క వికెట్టే పడగొట్టగలిగాడు.
రవిచంద్రన్ అశ్విన్కు ప్రత్యామ్నాయంగా జయంత్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఫిట్నెస్ పరీక్షల కోసం అతణ్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. బుధవారం నాటికి జయంత్ యాదవ్ బెంగళూరుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి టెస్ట్ మ్యాచ్ జులై 1వ బర్మింగ్ హామ్ ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఆరంభం కానుంది. కరోనా వైరస్ బారిన పడ్డ రవిచంద్రన్ అశ్విన్ అప్పటిలోగా కోలుకోగలిగితే- ఇంగ్లాండ్ వెళ్తాడు. లేకపోతే- అతని స్థానంలో జయంత్ యాదవ్ను పంపించనుంది బీసీసీఐ.
రవిచంద్రన్ అశ్విన్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అతనికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీనితో క్వారంటైన్లో వెళ్లాడు. కనీసం రెండు వారాలపాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంది. ఫలితంగా ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్టే. జులై 1వ తేదీన అయిదో టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి అశ్విన్ కోలుకుంటాడని భావిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది.