బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్గా కీలక బాధ్యతలు అందుకోనున్నాడని తెలుస్తోంది. జై షా ఎన్నిక ఏకగ్రీవం కానుందని సమాచారం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బలమైన క్రికెట్ బోర్డులు జైషాకు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్తో ముగుస్తుంది. నిబంధనల ప్రకారం పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఐసీసీ ఛైర్మన్గా ఎవరైనా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్కు చెందిన బార్క్లే ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి చేశాడు. మరో రెండేళ్లు ఛైర్మన్ పదవికి పోటీపడే అవకాశం ఉన్నప్పటికీ, ఆసక్తి లేదని బార్క్లే స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో జైషా పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే దీని గురించి ఆగస్ట్ 27లోపు స్పష్టత రానుంది. ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు అది ఆఖరి రోజు. జై షా పోటీచేస్తే ఎన్నికవ్వడం ఖాయమే. అదే జరిగితే ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా జైషా రికార్డుకెక్కనున్నారు. అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన అయిదో భారతీయుడిగా నిలవనున్నారు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు.
ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయుడిగా జగన్మోహన్ దాల్మియా చరిత్రలో నిలిచారు. ఆయన 1997 నుంచి 2000 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. బెంగాల్కు చెందిన జగన్మోహన్ బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఇక మహారాష్ట్రకు చెందిన పొలిటిషియన్ శరద్ పవార్ 2010 నుంచి 2012 వరకు ఛైర్మన్ బాధ్యతలు అందుకున్నాడు. ఐసీసీ చీఫ్గా శరద్ పవార్ ఉన్న సమయంలోనే భారత్ వన్డే వరల్డ్ కప్-2011 గెలిచింది.
అలాగే ఎన్ శ్రీనివాసన్ ఏడాది 136 రోజులు ఐసీసీ ఛైర్మన్గా పనిచేశారు. శ్రీనివాసన్ 2014-2015 వరకు పదవిలో కొనసాగారు. శశాంక్ మనోహర్ అత్యధికంగా అయిదేళ్లపాటు ఐసీసీని శాసించారు. 2015లో బాధ్యతలు అందుకున్న ఆయన 2020 వరకు కొనసాగారు. శశాంక్ అనంతరం ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే ఐసీసీ ఛీప్గా బాధ్యతలు తీసుకున్నాడు.