స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కంటే బీసీసీఐ కార్యదర్శి జై షా పవరఫుల్ వ్యక్తిగా జాతీయ మీడియా ప్రకటించింది. ఓ నేషనల్ ఫేమస్ మీడియా 'మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్-2024 లిస్ట్'ను విడుదల చేసింది. ఈ జాబితాలో క్రీడలకు సంబంధించిన వాళ్లలో జై షా అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. 35వ ర్యాంక్లో జై షా నిలిచాడు.
జై షా తర్వాత స్థానాలో కోహ్లి, ధోనీ, రోహిత్ వరుసగా ఉన్నారు. విరాట్ కోహ్లి 38, ధోనీ 58, రోహిత్ శర్మ 68వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే తమ ఆరాధ్య క్రికెటర్ల కంటే జై షా ముందుండటంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీగా జై షా ఎన్నికైన తర్వాత భారత క్రికెట్లో పెను మార్పులు సంభవించాయి. కొన్ని వివాదాస్పదంగా ఉంటే మరికొన్ని అభినందనీయంగా ఉన్నాయి.

టీమిండియా కెప్టెన్సీ మార్పులో బీసీసీఐ పెద్దలు తీసుకున్న నిర్ణయం పారదర్శకంగా లేదని విమర్శలు వచ్చాయి. కోహ్లిని ఉద్దేశపూర్వకంగా తప్పించారని కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఇక భారత క్రికెట్లో జైషా కొన్ని ప్రశంసనీయమైన నిర్ణయాలు తీసుకున్నాడు. పురుషుల క్రికెట్కు (ఐపీఎల్) దీటుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహించడం, మహిళా క్రికెటర్ల జీతభత్యాలు పెంచడం వంటి నిర్ణయాలపై ప్రశంసలు దక్కాయి. దేశవాళీ క్రికెట్ను ప్రోత్సహించేలా తీసుకున్న చర్యలకు మంచి మార్కులు పడ్డాయి.
అంతేగాక ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా జై షా ఇటీవల ఎన్నికయ్యాడు. ఈ పదవికి వరుసగా మూడోసారి సెలక్ట్ అయ్యాడు. 2021 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నాడు. ఆసియాలో క్రికెట్ను మరింత విస్తరించాలని జైషా భావిస్తున్నాడు. ఈ క్రమంలో నేపాల్ క్రికెట్కు భారత్ అండగా నిలుస్తోంది. నేపాల్ జట్టుకు శిక్షణ, మౌళిక వసతుల కల్పన, ఆటగాళ్లకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. గతంలో అఫ్గానిస్థాన్ క్రికెట్కు భారత్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీలో అన్ని దేశాల ఆటగాళ్లకు బీసీసీఐ మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రశంసలు పొందింది. ఈ ఏర్పాట్లు నిర్వహించడంలో బీసీసీఐ సెక్రటరీ 'జై షా'ది కీలకపాత్ర.