టీమిండియాలో చాలా మంది పేసర్లు ఉన్నారు. కానీ వాళ్లెవరూ కూడా జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చలేకపోతున్నారు. ఈ కారణంగానే బుమ్రా రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుమ్రా దాదాపు కోలుకున్నాడని, నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫుల్ ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్నాడని వార్తలొచ్చాయి.
దీంతో అతను త్వరలోనే టీమిండియాలోకి పునరాగమనం చేస్తాడని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. బుమ్రా పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు జై షా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీసులోనే బుమ్రా రీ ఎంట్రీ చేస్తాడా? అని అడగితే మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేమన్నాడు.

గతేడాది వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో మళ్లీ టీంలోకి వచ్చాడు. అయితే ఈ సిరీస్ రెండో మ్యాచులోనే బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో అతను మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ ఏదీ ఆడలేకపోయాడు.
ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స చేయించున్నాడు. ఇప్పుడు ఎన్సీయేలో కోలుకుంటున్నాడు. ఇటీవలే ఫుల్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టేశాడు. దీని గురించి మాట్లాడిన జై షా.. 'బుమ్రా పూర్తి ఫిట్గా ఉన్నాడు. అతను ఐర్లాండ్ సిరీస్ ఆడే అవకాశం ఉంది' అని స్పష్టం చేశాడు.
డబ్లిన్ వేదికగా ఈ రెండు జట్లు మూడు టీ20లు ఆడతాయని తెలిసిందే. ఈ సిరీసులో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులతోపాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.