టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ట్రోఫీ సాధించిన అనంతరం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్-కోహ్లి ప్రకటించారు. దశాబ్ద కాలం పాటు భారత విజయాల్లో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.అన్నిఫార్మాట్లలో భారత బ్యాటింగ్కు మూలస్తంభాలుగా సేవలు అందించారు.
అలాంటి ఈ ఇద్దరు ఒకేసారి పొట్టి ఫార్మాట్కు గుడ్బై పలకడంతో అభిమానులు ఆందోళన చెందారు. అంతేగాక వన్డే, టెస్టు ఫార్మాట్కు కూడా ఏ దశలో అయినా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కనీసం ఎప్పటివరకు భారత్కు ప్రాతినిథ్యం వహిస్తారనే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నాడు. 2025లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ వరకు సీనియర్లు కచ్చితంగా జట్టులో ఉంటారని జైషా తెలిపాడు.

అంతేగాక అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్ అని జై షా పేర్కొన్నాడు. ''వరుసగా పది మ్యాచ్లు గెలిచాం. కానీ నవంబర్ 23న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ విజయం సాధించలేకపోయాం. ట్రోఫీని సాధించనప్పటికీ హృదయాలు గెలిచాం. ఆ తర్వాత రాజ్కోట్లో నేనో విషయం చెప్పాను. జూన్ 29న హృదయాలతో టీ20 వరల్డ్ కప్ను గెలుస్తున్నాం. బార్బడోస్ భారత జెండా పాతుతున్నాం. చెప్పినట్లుగానే మన కెప్టెన్ రోహిత్ బార్బడోస్ మైదానంలో మువ్వన్నెల జెండాను పాతాడు''
''ఇక రానున్న ఐసీసీ టోర్నమెంట్లు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా గెలుస్తుందని, మరోసారి ఛాంపియన్లుగా నిలుస్తామని గట్టిగా నమ్ముతున్నాను'' అని జై షా పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లండ్లోని లార్డ్స్ వేదికగా వచ్చే ఏడాది జూన్లో జరగనుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి వయస్సు 35, రోహిత్ శర్మ వయస్సు 37 ఏళ్లు.