అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న ఆయన డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా 35 ఏళ్ల జై షా చరిత్ర సృష్టించాడు. గ్రెగ్ బార్క్లే స్థానంలో జై షా బాధ్యతలు అందుకోనున్నాడు.
కాగా, ఐసీసీ ఛైర్మన్గా ఎంపికైన అయిదో భారతీయుడిగా జైషా నిలిచాడు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే జై షా తన కొత్త బాధ్యతల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్కు మరింత ఆదరణ పెంచడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. టెస్టు ఫార్మాట్కు ఎక్కువ ప్రధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు. క్రికెటర్కు సుదీర్ఘ ఫార్మాట్ కీలకమని అన్నాడు.

''ఐసీసీ సభ్య బోర్డులు నాపై విశ్వాసాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. ఐసీసీ ఛైర్మన్గా ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్ను మరింత వ్యాప్తి చేయడానికి ఐసీసీ సభ్యులు, సభ్య దేశాలతో కలిసి పని చేస్తా. క్రికెట్కు మరింత ఆదరణ పెంచడమే మా లక్ష్యం. ఇక నా పదవి కాలంలో ప్రతిభను అన్వేషించడానికి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయానుకుంటున్నా''
''టీ20లుఉత్తేజకరమైన ఫార్మాట్. కానీ టెస్టులకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యం. ప్రతి క్రికెటర్ ఆటకు పునాది అదే. కాబట్టి క్రికెటర్లు టెస్టులు ఆడే చూడాలి. మేం కూడా ఇదే లక్ష్యంగా ప్రయత్నిస్తాం. ఇక మహిళలు, దివ్యాంగుల క్రికెట్ను ప్రోత్సహిస్తాం. కావాల్సిన వనరులను అందిస్తాం. అలాగే క్రికెట్ పురోగతికి ఉన్న అడ్డంకులు కూల్చివేయడానికి ప్రయత్నిద్దాం'' అని జై షా పేర్కొన్నాడు.
ఐసీసీ ఛైర్మన్ జై షా ఎన్నిక కావడంతో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారా అనే సందేహాలు ఎక్కువయ్యాయి. పాక్కు టీమిండియా వెళ్లదని బీసీసీఐ సెక్రటరీగా జై షా గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ ఛైర్మన్ కావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే ఆసక్తి అందరిలో పెరిగింది.