దాదాపు ఏడాదికాలంగా వెన్నుగాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఎన్సీయేలో ఫుల్ ఇంటెన్సిటీ ట్రైనింగ్లో పాలు పంచుకుంటున్న అతను.. త్వరలోనే మళ్లీ టీమిండియాతో చేరతాడని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ అతను ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో ఎవరికీ తెలియలేదు.
అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్కు తెరపడింది. బుమ్రా ఏకంగా టీమిండియా కెప్టన్గా రీఎంట్రీ ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నెలలో ఐర్లాండ్తో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది. వీటిలో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇస్తారని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ తాజాగా ధ్రువీకరించింది.

ఐర్లాండ్ పర్యటనకు ప్రకటించిన జట్టులో పాండ్యా పేరు లేదు. ఈ సిరీసులో టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. అలాగే అతని డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసింది. ఈ ఏడాది చివర్లో ఆసియా క్రీడల్లో భారత జట్టుకు గైక్వాడ్ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలో ఈ సిరీస్ అతనికి చాలా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఈ నెల 18, 20, 23వ తేదీల్లో మలాహిదె, డబ్లిన్ వేదికలుగా ఐర్లాండ్, భారత్ మూడు మూడు టీ20లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది.
ఈ సిరీసులో సీనియర్లు రోహిత్, కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యాకు కూడా విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. పూర్తిగా యువ ఆటగాళ్లతో జట్టును నింపేసింది. ఐపీఎల్ స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మ, శివమ్ దూబె తదితరులకు ఈ టీంలో చోటు దక్కింది. ప్రస్తుతం విండీస్లో ఉన్న పలువురు కూడా ఐర్లాండ్ సిరీస్కు ఎంపికయ్యారు. వీరంతా విండీస్ నుంచి నేరుగా ఐర్లాండ్ బయలుదేరుతారు.
జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్.