సెంచూరియన్ వేదికగా జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 408 పరుగులకు ఆలౌటైంది. 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 256/5తో ఇవాళ ఆటను ఆరంభించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డీన్ ఎల్గర్ (185), జేన్సన్ (84*) భారత్ బౌలర్లను తీవ్రంగా పరీక్ష పెట్టారు. అంతేగాక అక్కడి వాతావరణ పరిస్థితులతో టీమిండియా ప్లేయర్లు తొందరగా అలసిపోయారు. కానీ తిరిగి పుంజుకొని భారత్ బౌలర్లు సత్తాచాటారు.
మరోవైపు గాయం కారణంగా సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా బ్యాటింగ్కు రాలేదు. దీంతో తొమ్మిది వికెట్లు పడటంతోనే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లుతో సత్తా చాటాడు. సిరాజ్ రెండు వికెట్లు, శార్దూల్, అశ్విన్, ప్రసిధ్ తలో వికెట్ తీశారు.

అయితే రబాడను బుమ్రా అద్భుతంగా బౌల్డ్ చేశాడు. ఆఫ్స్టంప్ను గురిపెట్టి బుల్లెట్లా బంతిని విసిరాడు. దాన్ని డిఫెండ్ చేయడానికి రబాడ తీవ్రంగా ప్రయత్నించినా కుదరలేదు. వికెట్ గాల్లోకి ఎగిరి పడింది. దీంతో బుమ్రా బౌలింగ్కు రబాడ బిత్తెరపోయాడు. ఆ తర్వాత తేరుకొని అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో రబాడ అయిదు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, శార్దూల్ వంటి కీలక వికెట్లు తీశాడు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా బంతుల్ని వేసి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. దానికి ప్రతీకారంగా అన్నట్టుగా బుమ్రా సవాలైన బంతిని రబాడకు వదిలాడు. దీనికి సంబంధిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 245 పరుగులకు ఆలౌటై న సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ (101) వీరోచిత శతకం సాధించాడు. 121/6తో కష్టాల్లో ఉన్న టీమిండియా 245 పరుగులు చేసిందంటే అది రాహుల్ పోరాటంతోనే. కాగా, ఈ టెస్టులో విజయం సాధించాలంటే టీమిండియా అద్భుత ప్రదర్శన చేయాల్సిందే.