
హైదరాబాద్: వెన్నునొప్పి గాయం నుంచి కోలుకుంటున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సోమవారం ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోమవారం బుమ్రా సూట్ ధరించి ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ "Playing it cool" అనే కామెంట్ పెట్టాడు.
దీంతో నెటిజన్లు "ఎక్కడున్నావ్" అని ట్విట్టర్లో అడగడం మొదలుపెట్టారు. అంతేకాదు, త్వరగా జట్టులో చేరాలని ఓటమి నుంచి టీమిండియాను తప్పించాలని కోరుకుంటా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్) రాణించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బంగ్లా విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌండ్రీ వద్ద కృనాల్ క్యాచ్ వదిలేయడంతో ముష్ఫికర్ బతికిపోయాడు. ఆ ఓవర్లో బంగ్లా 13 పరుగులు పిండుకుంది. ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో ముష్ఫికర్ వరుసగా 4 ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.
ఈ మ్యాచ్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్గా పేరుగాంచిన బుమ్రా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. "నిన్నటి మ్యాచ్లో నిన్ను మిస్సయ్యాం" అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.... "నువ్వు త్వరగా జట్టులోకి వచ్చేయ" అంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
బుమ్రా ఐపీఎల్లో ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్కు బుమ్రా దూరమయ్యాడు. నడమ కింది భాగంలో నొప్పితో సతమవుతున్న బుమ్రా కొన్ని రోజులుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.