ముంబై: జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా ప్రధాన పేసర్ అయిన బుమ్రా.. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్, బౌన్సర్, యార్కర్ ఇలా ఏ రకమైన బంతులనైనా అలవోకగా సంధించగల సామర్థ్యం కలవాడు. ఆరంభ, డెత్ ఓవర్లలో అద్భుత యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మన్ను బోల్తాకొట్టిస్తాడు. కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాల చేత ప్రశంసలు అందికున్నాడు. అయితే తన కెరీర్ ఎదుగుదలలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ షేన్ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని బుమ్రా తెలిపాడు.
IND vs SL: సందిగ్ధంలో భారత్ vs శ్రీలంక పర్యటన.. కారణం అదే!!
ఐపీఎల్ ప్రాంచైజ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా షేన్ బాండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా కాలంగా ఆడుతున్నాడు. షేన్ బాండ్తో తనకున్న అనుబంధం గురించి బుమ్రా మాట్లాడిన వీడియోని ముంబై ఇండియన్స్ శుక్రవారం ట్విటర్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో షేన్ బాండ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె, జిమ్మీ నీషమ్ కూడా మాట్లాడారు. చిన్నప్పటి నుంచే బాండ్ బౌలింగ్ని చూస్తున్నానని, మొదటిసారిగా 2015లో కలిశానని యార్కర్ కింగ్ చెప్పాడు.
'నేను షేన్ బాండ్ని మొదటిసారిగా 2015లో కలిశాను. నా చిన్నప్పటి నుంచే అతని బౌలింగ్ని చూస్తున్నా. నా బౌలింగ్ జట్టుకు ఎలా ఉపయోగపడుతుందా? అని ఎప్పుడూ ఆలోచిస్తూ అందుకు తగినట్టుగా బౌలింగ్ చేసేవాడు. నేను క్రికెటర్గా రాణించడానికి ఎంతో సహకరించాడు. ఆయనను కలవడం మంచి అనుభవం. మైదానంలో ప్రయత్నించే విభిన్న కోణాలపై సూచనలిస్తూ సహకరించేవాడు. నేను ఎక్కడ ఉన్నా, భారత జట్టుతో ఉన్నప్పుడు కూడా బాండ్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను' అని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు.
'షేన్ బాండ్తో ఉన్న అనుబంధం ప్రతి సంవత్సరం మెరుగవుతోంది. ఈ అనుబంధం మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి. ప్రతి సంవత్సరం ఆయన నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటా. వాటిని నా బౌలింగ్లో ప్రదర్శించడానికి ప్రయత్నిస్తా. ముంబై జట్టులో ఆయన ఉండడం న అదృష్టమని చెప్పాలి' అని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. బుమ్రా ప్రపంచంలోనే ఉత్తమ డెత్ బౌలర్ అని షేన్ బాండ్ కొనియాడాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, అనంతరం ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో బుమ్రా ఆడనున్నాడు.
ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా.. 23 జనవరి 2016లో భారత జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం భారత పేస్ విభాగంను తన భుజాలపై మోస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2021 వాయిదా పడినా.. జూన్లోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ జరగనుంది. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్ ఉంది. బుమ్రా భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.