
విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్లో విజయం సాధించడమే తాము అతనికిచ్చే గొప్ప బహుమతి అని టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. శుక్రవారం నుంచి శ్రీలంతో జరబోయే టెస్టు మ్యాచ్తో విరాట్ కోహ్లీ 100 టెస్టు మ్యాచ్ల మైలురాయిని చేరుకోనున్న నేపథ్యంలో బుమ్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావానికి అతని వందో టెస్టు మ్యాచే నిదర్శనమని చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 100 మ్యాచ్లు ఆడడమనేది ఎవరికైనా ప్రత్యేకమైనదేనని బుమ్రా అన్నాడు. ఇది కోహ్లీ హార్డ్ వర్కను తెలియచేస్తుందని చెప్పాడు. టీమిండియా విజయాల కోసం విరాట్ కోహ్లీ ఎన్నో త్యాగాలు చేశాడని, భవిష్యత్లోనూ ఇలాగే రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని బుమ్రా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
ఇక ఇప్పటివకే ఎన్నో రికార్డులను సాధించిన విరాట్ కోహ్లీ ఖాతాలో వందో టెస్టు మ్యాచ్ అనేది మరో ఘనత అని బుమ్రా చెప్పాడు. ఒక క్రికెటర్గా తన వందో టెస్టులో కోహ్లీ అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం తామంతా ఆటపైనే దృష్టి పెట్టామని, పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగుతామని బుమ్రా చెప్పాడు. కాగా తన కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 50 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా వందో టెస్టు మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ను వీక్షించడానికి ప్రేక్షకులను బీసీసీఐ స్టేడియంలోకి అనుమతించింది. స్టేడియం కెపాసిటీలో 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ధృవికరించింది. అలాగే బీసీసీఐ కూడా ధృవీకరించింది. విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగదని బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక ప్రకటనలో తెలిపారు. తాను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో మాట్లాడానని, ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న విరాట్ కోహ్లీకి జైషా శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ మరిన్ని టెస్టులు ఆడాలని కోరుకుంటున్నానని, అతని వందో టెస్టు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని జైషా చెప్పారు. అయితే కోహ్లీ వందో టెస్టు మ్యాచ్కు సంబంధించిన టికెట్లు బుధవారం నుంచే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి.