ఆ ఆలోచనలు నా మదిలో కూడా మెదిలాయి
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా తాజాగా క్రిక్బజ్ స్పైసీ పిచ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన అరంగేట్రం నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'అరంగేట్ర మ్యాచ్ ప్రతీ ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ క్షణాలను ఎవరూ మరిచిపోరు. తొలి మ్యాచ్ ఆడే క్రికెటర్పై అందరిలోనూ ఎన్నో అంచనాలు ఉంటాయి. దీంతో అరంగేట్ర ఆటగాడిపై అధిక ఒత్తిడి ఉంటుంది. రాణిస్తే ఫర్వాలేదు, లేదంటే జట్టులో స్థానమే పోతుంది. ఇవే ఆలోచనలు నా మదిలో కూడా మెదిలాయి' అని తెలిపాడు.
ఆటను ఆస్వాదించమన్నాడు
'అరంగేట్ర మ్యాచ్లో తొలి బంతి వేయడానికి ముందు జట్టులోని సభ్యులు ఎవరూ నాదగ్గరికి రాలేదు. ఏం చెప్పలేదు. కానీ.. ఎంఎస్ ధోనీ మాత్రం నేను బౌలింగ్కు సిద్దమవుతున్న సమయంలో నా దగ్గరికి వచ్చాడు. నీకు నువ్వులా ఉండు, నీ ఆటను నువ్వు ఎంజాయ్ చేయ్, ఆటను ఆస్వాదించు అని ధైర్యం చెప్పాడు' అని బుమ్రా పేర్కొన్నాడు.
తొలి టెస్టులో విఫలం
వెన్నుగాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమైన బుమ్రా.. రీఎంట్రీలో పేలవ ఫామ్తో నిరుత్సాహపరుస్తున్నాడు. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి టెస్టులో 88 పరుగులిచ్చి ఒకే వికెట్ తీసాడు. గత మూడేళ్లుగా కీలక బౌలర్గా సేవలందించి.. డెత్ ఓవర్లలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న బుమ్రా ఇప్పుడు గడ్డు పరిస్థుతలను ఎదుర్కొంటున్నాడు.
ధోనీ నాయకత్వంలో జట్టులోకి
ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ తరఫున మంచి ప్రదర్శన చేసిన బుమ్రా.. భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2016లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జట్టులోకి వచ్చిన బుమ్రా.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించి ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా ఎదిగాడు. జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే గతేడాది వెన్నునొప్పితో బాధపడుతూ శస్త్ర చికిత్స పొందాడు. అయితే గాయం నుంచి కోలుకున్నాక లయ తప్పినట్లు కనపడుతున్నాడు. న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ముందు మూడు వన్డేలాడి అక్కడ విఫలమయ్యాడు. ఇప్పటికైనా లయ అందుకుంటాడో చూడాలి.