భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ డేట్ ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఈ స్టార్ ప్లేయర్ వెన్నుగాయంతో చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది ఆసియా కప్కు ముందు గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించిన బుమ్రా.. ఆసీస్తో సిరీస్లో నొప్పితో విలవిల్లాడాడు.
దీంతో అతను ఆసియా కప్ టీ20, టీ20 వరల్డ్ కప్ రెండూ ఆడలేదు. ఆ తర్వాత జరిగిన శ్రీలంక, కివీస్ సిరీసులకు కూడా దూరంగానే ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడలేదు. ఈ నెల మార్చిలో న్యూజిల్యాండ్లో శస్త్రచికిత్స చేయించుకున్న అతను.. నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.

అతనితోపాటు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో అతను ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అనంతరం లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్న అయ్యర్ కూడా ఎన్సీయేలోనే ఉన్నాడు. వీళ్లిద్దరూ వేగంగా కోలుకుంటున్నట్లు ఎన్సీయే ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
బుమ్రా, అయ్యర్ ఇద్దరూ కోలుకుంటున్నారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమయ్యే ఆసియా కప్లో వీళ్లిద్దరూ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం బుమ్రా తన సోషల్ మీడియాలో క్రికెట్ షూస్ ఫొటో షేర్ చేశాడు. అప్పటి నుంచే అతను మళ్లీ బౌలింగ్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపించాయి.
బుమ్రా, అయ్యర్ కనుక జట్టుతో చేరితే వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు బలం రెట్టింపు అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బుమ్రా లేకపోవడం వల్లనే టీ20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడిపోయిందనే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. మరి వీరి పునరాగమనంతో అయినా భారత జట్టు తలరాత మారుతుందేమో చూడాలి.