ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడు. స్పిన్ పిచ్పై వికెట్ల వేట మొదలుపెట్టాడు. ఇటీవల ఎప్పుడూ చేయని విధంగా కోపంతో, దూకుడుగా వికెట్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 436 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలసిందే. ఓవర్నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం సాధించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. బజ్బాల్ క్రికెట్తోనే వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ జాక్ క్రాలే (31; 33 బంతుల్లో)ను అశ్విన్ ఔట్ చేసినప్పటికీ లంచ్ విరామానికి 15 ఓవర్లలో 89/1తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. అనంతరం రెండో సెషన్ ప్రారంభంలోనూ ఇంగ్లిష్ జట్టు అదే జోరును కొనసాగించింది.

అయితే మరో ఓపెనర్ డకెల్ (47; 52 బంతుల్లో) రెండు ఫోర్లు బాది బుమ్రాను రెచ్చగొట్టాడు. దీంతో తర్వాత బాల్ను బుమ్రా బుల్లెట్లా సంధించాడు. దానికి డకెట్ వద్ద సమాధానం లభించలేదు. వికెట్ అమాంతం గాల్లోకి ఎగిరిపడింది. అనంతరం బుమ్రా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. పంచ్ను విసురుతూ కమాన్ అంటూ బిగ్గరగా అరిచాడు.
బుమ్రా అంతటితో ఆగలేదు. తర్వాతి ఓవర్లోనే ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ను బోల్తాకొట్టించాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 117 పరుగులకే ప్రత్యర్థి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో బజ్బాల్ను పక్కనపెట్టి ఆ జట్టు డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిపోయింది. రూట్కు 17 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసిన బుమ్రా ఏడు సార్లు ఔట్ చేయడం విశేషం. అయితే కాపేపటికే బెయిర్ స్టో (10)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో 140/4తో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 41 పరుగుల వెనుకంజలో ఉంది.