టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్ల కంటే బౌలర్లే సారథులుగా మెరుగ్గా బాధ్యతలు నిర్వర్తించగలరని అన్నాడు. బ్యాటర్ల కంటే బౌలర్లే తెలివైనవాళ్లని తెలిపాడు. చరిత్ర కూడా దీన్ని నిరూపించిందని పేర్కొన్నాడు. అయితే శారీకంగా బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లను కెప్టెన్లుగా చేస్తున్నారని బుమ్రా చెప్పాడు.
''బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాటు, ఫ్లాట్ వికెట్ వెనుక బౌలర్లు దాక్కోవట్లేదు. ఓ మ్యాచ్ ఓటమిపాలైతే బౌలర్లనే నిందిస్తారు. అందుకే ఇది కష్టమైన జాబ్. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అయితే ఈ సవాళ్లే విజయం సాధించడంతో కొత్త మార్గాలను అన్వేషించేలా చేస్తుంది. అసమానతలతో చేసే పోరాటం ధైర్యంగా చేస్తుంది. ఇక నాయకుడిగా ధైర్యంగా ఉండాలి.''

''ప్యాట్ కమిన్స్ సత్తాచాటడం చూస్తున్నాం. వసీమ్ అక్రమ్ కెప్టెన్సీని చూశాను. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ ప్రపంచకప్లు గెలిచారు. బౌలర్లు తెలివైనవాళ్లు. అయితే కొన్నిసార్లు శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే కెప్టెన్సీని బ్యాటర్లకు ఎక్కువగా ఇస్తారని నా అభిప్రాయం. కానీ నా దృష్టిలో బ్యాటర్ల కంటే బౌలర్లే ఇస్మార్ట్'' అని బుమ్రా అన్నాడు.
మీ ఫేవరేట్ కెప్టెన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు బుమ్రా భిన్నంగా స్పందించాడు. ''నేనే నా అత్యుత్తమ కెప్టెన్. కొన్ని గేమ్లకు నేను కెప్టెన్సీ చేశాను. ఎంతో మంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ నా ఫేవరేట్ కెప్టెన్ ఎవరంటే నేనే అని చెబుతాను'' అని బుమ్రా పేర్కొన్నాడు. ఐర్లాండ్ సిరీస్కు బుమ్రానే జట్టు పగ్గాలు అందుకున్నాడు. కాగా, ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన బుమ్రా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాడు.